TRS Congress Tweet War : తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు అంటూ తెలంగాణ దీక్షా దివస్ పేరిట టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ తదితరులు నిన్న నవంబర్ 29న ట్వీట్లు చేశారు. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. దీక్షా దివస్ కాదు.. దగా దివస్ అంటూ కవితకు రిప్లై ఇచ్చింది కాంగ్రెస్. దీంతో కవిత స్పందించారు. తెలంగాణలో బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనంటూ ఫైర్ అయ్యారు కవిత. తెలంగాణ ద్రోహుల పార్టీ కాంగ్రెస్ అని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు కవిత.
ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే బతుకమ్మ ఆడినందుకే బోనం కుండలు ఎత్తినందుకే.. మీ ఇంటిల్లిపాదీ సకల పదవులు, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!? అంటూ కవితకు ఘాటు రిప్లై ఇచ్చారు రేవంత్ రెడ్డి. అమరవీరుల బలిదానాలకు ‘చంద్ర’గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది? అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. త్యాగాలు చేసిందెవరు… భోగాలు అనుభవిస్తోందెవరని యావత్ తెలంగాణ ఘోషిస్తోందంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
మరోవైపు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. మహిళలు, బతుకమ్మ, బోనాలను కించపరిచడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల చేత బతుకమ్మ ఎత్తించినా, బతుకమ్మ పేరు ఉచ్ఛరించేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతేనని కవిత పేర్కొన్నారు. చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం, బోనం, బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళలపై మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందంటూ కవిత ఫైర్ అయ్యారు. మిలియన్ మార్చ్, సాగరహారం, అసెంబ్లీ ముట్టడిలో ఆడబిడ్డలం ముందున్నాం.. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఎక్కడంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.