హైదరాబాద్, స్వేచ్ఛ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాలు భేటీ అయ్యాయి. జూబ్లీహిల్స్లోని సీఎం అధికారిక నివాసంలో బుధవారం భేటీ అయిన పలు సంఘాల ప్రతినిధులు, తమ సమస్యలను వివరించారు. ఆమధ్య జైనూరు ఘటన పెద్ద దుమారానికి దారి తీసింది. ఆదివాసీలు, మైనారిటీ వర్గాల మధ్య చిచ్చు రాజేసింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇరు వర్గాలతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా ఆదివాసీ సంఘాలను తీసుకుని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో తమ సమస్యలను వివరించారు ఆదివాసీ సంఘాల నేతలు. స్థానికంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ వినతి పత్రాలు అందజేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని విన్నవించారు. అన్నింటినీ సావధానంగా విన్న రేవంత్, దీపావళి లోపు సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ సమావేశానికి ఆదివాసీ సంఘాలను, ముఖ్యలను ఆహ్వానిస్తామని తెలిపారు. డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆదిలాబాద్ కలెక్టర్గా పనిచేసి అక్కడి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న దివ్య దేవరాజన్ను పంపించి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం.