Minor accident to Bangalore Express: మహబూబ్నగర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల రైల్వే స్టేషన్లో బెంగుళూరు ఎక్స్ ప్రెస్కు స్వల్ప ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి బెంగుళూరు ఎక్స్ ప్రెస్ జడ్చర్ల రైల్వే స్టేషన్కు చేరుకోగానే ఏసీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. జడ్చర్ల రైల్వే స్టేషన్లో బెంగుళూరు ఎక్స్ ప్రెస్ రైలును సుమారు 30 నిమిషాల పాటు నిలిపివేశారు. అధికారులు పొగలు వచ్చిన బోగీ వద్దకు వెళ్లి పరిశీలించారు. భద్రతా సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. మరమ్మతులు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీ2 ఏసీ బోగిలోని రైలు చక్రాల వద్ద రాపిడికి గురి కావడంతో మోటారులో సాంకేతిక లోపం కారణంగా పొగలు వ్యాపించాయని చెప్పారు. ఈ ప్రమాదం రాత్రి 8.30 గంటలకు జరిగనట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అనంతరం రైలును పంపించారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.