Mulugu : ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలో కొందరు యువకులు కలిసి ఇనుప పోల్కు జాతీయ జెండాని ఎగరవేయాలని భావించారు. అయితే జాతీయ జెండాను అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి బోడ విజయ్(25) అంజిత్(35) చక్రి (25)లు విద్యుతాఘాతానికి గురయ్యారు.
స్థానికులు హుటాహుటిన బాధితులను ములుగు ఏరియా హాస్పిటల్కి తరలించారు. అప్పటికే విజయ్, అజిత్లు మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. స్వల్ప గాయాలతో చక్రి క్షేమంగా ఉన్నట్టు వైద్యలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యుతఘాతంతో ఇద్దరు మృతి చెందడంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతుల కుటుంబాలను మంత్రి సీతక్క పరామర్శించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద పదివేలు అందజేశారు. విద్యుత్ శాఖ తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందేలా చూస్తానని, వారి కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి సీతక్క బాధిత కుటుంబాలకు హమీ ఇచ్చారు.