Tragedy during the festival, husband and wife died due to electric shock: లోకమంతా రాఖీ పండుగ సంబరాల్లో మునిగితేలుతుంటే.. ఖమ్మం జిల్లాలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో విద్యుత్ షాక్తో దంపతులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురం గ్రామంలో జరిగింది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల తెలిపిన కథనం ప్రకారం.. బస్వాపురం గ్రామానికి చెందిన బానోతు శ్రీను, షమీనలు దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.. అన్యోన్యంగా సాగిపోతున్న వారి దాంపత్య జీవితంలో ఓ కుమార్తె ప్రియాంక జన్మించింది..
భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. అయితే ఉదయం బట్టలు ఉతికిన షమీన ఇంటి ముందున్న ఇనుపతీగ దండెంపై ఆరేస్తుండగా ఆ తీగకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్తో అక్కడికక్కడే పడిపోయి చనిపోయింది. అదే టైమ్లో వారి ఇంటికి వచ్చిన పక్కింటి వ్యక్తి షమీన కిందపడటాన్ని గమనించి ఆమె భర్త శ్రీనుకు సమాచారం అందించాడు. ఇంట్లో ఉన్న భర్త కొంతకాలంగా షమీనా అనారోగ్యంతో బాధపడుతోందని.. అప్పుడప్పుడు ఇలా స్పృహతప్పి పడిపోతూ ఉండేదని అనుకున్నాడు. అలాగే పడిపోయిందనుకున్న శ్రీను తన భార్యను లేపేందుకు ట్రై చేశాడు. దీంతో అతడికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృత్యువాత పడ్డాడు.
Also Read: ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకి జన్మనిచ్చిన తల్లి
దీనిని గమనించిన శ్రీను స్నేహితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అక్కడికి వచ్చి ఆ దంపతులను వెంటనే ఇల్లెందు ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. దవాఖానలో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాఖీ పౌర్ణమి రోజు భార్యభర్తలిద్దరూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులిద్దరి కుమార్తె ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కారేపల్లి ఎస్ఐ రాజారాం తెలిపారు.