Hyderabad-Vijayawada highway: హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి గురువారం వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయి. సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఆదివారం నుంచి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్ మళ్లిస్తామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి ఇలా వెళ్లాలి..
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 గుండా బీబీగూడెం మీదుగా మళ్లిస్తారు. రాఘవాపురం స్టేజ్, నామవరం, గుంజలూరు స్టేజ్ వద్ద తిరిగి 65వ జాతీయ రహదారిపైకి వాహనాలు చేరుకునేలా రూట్మ్యాప్ సిద్ధం చేశారు. భారీ, సరకు రవాణా వాహనాలు మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నాయకన్గూడెం నుంచి కోదాడకు వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించారు.
విజయవాడ నుంచి ఇలా రావాలి..
విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు కోదాడ, మునగాల, గుంపుల మీదుగా దురాజ్పల్లి సమీపంలోని స్వామి నారాయణ ట్రస్ట్ ఎదురుగా ఉన్న SRSP కాలువ నుంచి బీబీగూడెం, రోళ్లవాగుతండా మీదుగా టేకుమట్ల బ్రిడ్జి మీదకు మళ్లిస్తారు. భారీ, సరకు రవాణా వాహనాలు కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకునేలా రూట్ మ్యాప్ రూపొందించారు. వ్యక్తిగత వాహనాలు సైతం ఇదే మార్గంలో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని పోలీసులు సూచిస్తున్నారు.
పెద్దగట్టు జాతర విశేషాలేంటి?
తెలంగాణలో జరిగే రెండో పెద్ద జాతర పెద్దగట్టు జాతర. లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్య దైవం. రెండేళ్ల కొకసారి జరిగే ఈ జాతరకు 10 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఏపీ, ఛత్తీస్ గడ్ , ఒడిశా నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. మొత్తం ఐదురోజులపాటు ఈ జాతర జరుగుతుంది. అందువల్లే ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.