Hyderabad: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పొలీసుల అధికారులు తెలిపారు. భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సోమవారం రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు.
ఈ నెల 18న సాయంత్రం 6:25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారం నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించనున్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి రాష్ట్ర పతి పర్యటనకు సంబంధించి పర్యవేక్షణ చేయనున్నారు.హైదరాబాద్ లో రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్, ఇంటిలిజెన్స్ సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారని పోలీసులు తెలిపారు.
సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.