Traffic Restrictions: రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనున్నది. బోనాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, ఆలయ సిబ్బంది ఇప్పటికే పూర్తి చేశారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల్లో వస్తున్న సమాచారం ప్రకారం.. బోనాల జాతర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రేపు, ఎల్లుండి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలో మీటర్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని పేర్కొన్నారు.
రాణిగంజ్, కర్బాలా మైదాన్, పారడైస్, సీటీవో ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోడ్, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్ లేన్, బైబిల్ హౌజ్, బాటా, మినిస్టర్ రోడ్, రసూల్ పురా వైపుగా వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
టోబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్ కు వచ్చే రోడ్డు, బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వరకు, జనరల్ బజార్ రోడ్డు, ఆదయ్య ఎక్స్ రోడ్డు మూసివేయనున్నట్లు తెలిపారు.
Also Read: కేసీఆర్ తనకు తానే ఆర్కిటెక్ట్ అనుకుని కట్టిన ప్రాజెక్ట్ ఇదీ.. అందుకే ఇంత నష్టం
ఇదిలా ఉంటే.. మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. రేపు, ఎల్లుండి ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది.