TPCC Chief Revanth Reddy : డిగ్రీలకు డిగ్రీలు చదివి ఉద్యోగాలు దొరకక యువతలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ కొలువు కాదు కదా.. చిన్నదో, పెద్దదో.. ప్రైవేట్ ఉద్యోగం కూడా దొరకని పరిస్థితి. ఐటీ సంస్థల్లో ఉద్యోగాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త ఉద్యోగాల సంగతి పక్కనపెడితే.. ప్రస్తుతం అక్కడ పనిచేసే వారికి కూడా ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వ కొలువుల విషయానికొస్తే.. గ్రూప్-1 నుంచి గ్రూప్ -4 వరకూ ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉన్నా పరీక్షలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కేసులోనూ.. గ్రూప్ పరీక్షల అంశం తెరపైకి వచ్చింది. ఉద్యోగాలు రాక యువత మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ధీటుగా స్పందించాయి. ఈ నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ యువతికి ఉద్యోగ హామీ ఇచ్చారు.
ఉద్యోగంపై ఓ దివ్యాంగురాలికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని.. నాంపల్లికి చెందిన రజిని అనే యువతి రేవంత్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజిని పేరుతో స్వయంగా నింపారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ఖర్గే వస్తారని.. అదే రోజు రజినికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. ఇది తన గ్యారెంటీ అని రజినికి చెప్పారు రేవంత్రెడ్డి.