TPCC Chief Mahesh Kumar goud: నెలలో ఒకసారి సీఎం.. వారానికొకసారి మంత్రులు గాంధీ భవన్కు రావాలంటూ తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను పీసీసీ అధ్యక్షుడినైనా కార్యకర్త గానే ఉంటాను. గాంధీ భవన్ ఓ దేవాలయం. విబేధాలను పక్కకు పెట్టి అందరూ తిరగడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇద్దరు విభిన్నమైన వ్యక్తులతో కలిసి పని చేశాను. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మరొకరు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకులు అందరినీ కో ఆర్డినేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అందరూ కలిసి పని చేస్తున్నారు. నాకు గాంధీ భవన్ తో 40 ఏండ్ల అనుబంధం ఉంది. గాంధీ భవన్ లో నేను తాకని ప్రదేశం లేదు. ప్రజాస్వామ్యయుతంగా నేను ఉంటాను.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష వలన గాంధీ అనుచరులు వాళ్ల ఇంటి వద్ద ఆందోళన చేశారు. మనది రాయలసీమ కాదు. కేసీఆర్ సీఎం అయ్యాక భాష మారిపోయింది. కేసీఆర్ భాషకు రేవంత్ భాష తో సమాధానం చెప్పాడు. అందుకే మనం అధికారంలోకి వచ్చాం. నేను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఏనాడు అనుకోలేదు. నా స్థాయికి నేను పీసీసీ అధ్యక్షుడిని కాబోనేమోనని అనుకున్నాను. నాకు ఇన్ని రోజులు పదవులు ఎందుకు రాలేదని నేను ఏనాడు అనుకోలేదు. కేవలం పని చేసుకుంటూ ముందుకెళ్లా.
రాజకీయాల్లో ఎంత కష్ట పడి పని చేసినా ఒక్క శాతం అదృష్టం ఉండాలి. అందుకే నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇటు పీసీసీ పదవి కూడా వచ్చింది. నేనే మీకు పెద్ద ఉదాహరణ. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ తన కుటుంబం కోసం వాడుకున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే చెప్పిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాను సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారు. నాకు భేషజాలు లేవు..గాంధీ భవన్ లో పవర్ సెంటర్ లు లేవు..ఒక్కటే పవర్ సెంటర్ రాహుల్ గాంధే పవర్ సెంటర్. గాంధీ భవన్ లో 6 గంటలపాటు నేను అందుబాటులో ఉంటాను. రెండు ఇరానీ చాయ్ లు తాగుతాను.
హైడ్రా అనేది చారిత్రక నిర్ణయం. హైదరాబాద్ అనేది రాక్స్ అండ్ లెక్స్ సిటీ. హైడ్రాను హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చెయ్యకూడదు. జిల్లాలకు కూడా విస్తరించాలి. తెలియక చెరువులు దగ్గర కొనుకున్నవాళ్లకు వేరే దగ్గర ఇళ్లు కట్టివ్వాలి. కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న ఆస్తులు ఎవరికి లేవు. మనకు కూడా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండాలి. జిల్లాలో పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించండి. ప్రతివారం ఒక ఇద్దరు మంత్రులు గాంధీ భవన్ కు రావాలి. బుధవారం ఒకరు.. శుక్రవారం ఒక మంత్రి అందుబాటులో ఉండాలి. నెలలో ఒకసారి గాంధీ భవన్ కు సీఎం రావాలి’ అంటూ మహేశ్ కుమార్ అన్నారు.