Tpcc Chief Comments : తెలంగాణ క్యాబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖను తొలగిస్తారన్న అంశంపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చేశారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సురేఖ అంశం ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని, అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
అయితే వివాదం చెలరేగిన నేపథ్యంలో మంత్రి సురేఖ తన మాటలను వెనక్కి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఫలితంగా ఈ ఇష్యూ ఆరోజే ముగిసిపోయిందన్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సైతం తమను ఎలాంటి వివరణ అడగలేదని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోంది…
కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు బలమైన మహిళా నాయకులు ఉన్నారని, అలాంటివారు మంత్రులుగా కొనసాగుతుంటే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందన్నారు. అందుకే వీరినే సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణలు గుప్పించారు.
ఈ విషయంలో గులాబీ పార్టీ సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తోందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ గొంతు మాత్రమే వినిపించామని కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఫోటోలు మార్ఫింగ్ చేసే స్థితికి దిగజారిందన్నారు. ఫేక్ పోస్టులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.
త్వరలోనే కొత్త పీసీసీ కార్యవర్గం…
ఈనెలాఖరులోగా పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మరోవైపు బీసీలపై తమ పార్టీ సానుకూలంగానే స్పందిస్తోందన్నారు.
ఇంకోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల కోసం గొంతు లేవనెత్తారని, అలాంటప్పుడు పార్టీ లైన్ తప్పారని అనలేమని వివరించారు. ఇక ఎంఐఎంతో ఫ్రెండ్ షిప్ వేరని, శాంతిభద్రతల పరిరక్షణ అంశం వేరు అని క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ నాంపల్లి అభ్యర్థి, ఫిరోజ్ ఖాన్ కి సంబంధించిన అంశంలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
తప్పు మా వాళ్లు చేసినా, అవతల పార్టీల వాళ్లు చేసినా చట్టం తనపని తాను చేసుకుంటూ పోతోందన్నారు. చట్టం అందరికీ సమానమేనన్నారు.
ఆ ఎన్నికల వల్లే ఆలస్యం…
దసరాలోగా మిగిలిన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేద్దామని అనుకున్నామని పార్టీ ప్రెసిడెంట్ అన్నారు. హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల కారణంగా ప్రకటన ఆలస్యం అవుతోందన్నారు.
ఆ పార్టీలు దొందు దొందే…
బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడమే ఇందుకు కారణమమన్నారు. ఇక ఇదే కేసులో మనీష్ సిసోడియా సైతం అరెస్ట్ అయ్యారని, కానీ అతనికి బెయిల్ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, ఈ ఇద్దరి లక్ష్యం కాంగ్రెస్ పార్టీనేనన్నారు.
తమ పార్టీపై ప్రేమతోనే కొందరు బీఆర్ఎస్ నేతలు జాయిన్ అవుతున్నారని, మరికొద్ది రోజుల్లోనే ఇంకొన్ని చేరికలు ఉంటాయన్నారు. పలుచోట్ల ఇబ్బంది ఉన్న కారణంగానే చేరికలకు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. భవిష్యత్ తరాల పరిరక్షణ కోసమే హైడ్రా తెచ్చామన్నారు. అందులో భాగంగానే మూసీ ప్రక్షాళన సైతం చేస్తున్నామన్నారు. అయితే ఇందుకు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అని తాము చెప్పలేదని, ఇతర పార్టీలు ఏదేదో ఊహించుకోవద్దన్నారు.
Also Read : సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 60 రోజులే సమయం!