హైదరాబాద్ గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి క్యూ కట్టారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఆశావహులతో గాంధీభవన్ కిక్కిరిసిపోయింది. దరఖాస్తు సమర్పణ తుదిగడువు ఆగస్టు 25. గడువు ముగుస్తుండటంతో టిక్కెట్ ఆశిస్తున్న నేతలు దరఖాస్తు చేసుకోవడానికి భారీగా తరలివస్తున్నారు.
ఇప్పటివరకు 700 మంది నేతలు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి అప్లికేషన్ దాఖలు చేశారు. కామారెడ్డి నుంచి షబ్బీర్ ఆలీ, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి దరఖాస్తు పెట్టుకున్నారు. చివరిరోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు దరఖాస్తులు సమర్పించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపు కోసం ప్రత్యేక ప్రక్రియ చేపట్టింది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న నేతలు దరఖాస్తులు పెట్టుకోవాలని ఆదేశించింది. జనరల్ అభ్యర్థులకు రూ. 50 వేలు, బీసీలకు 25వేలు ధర నిర్ణయించగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థుల నుంచి ఉచితంగా దరఖాస్తులు తీసుకుంటోంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిపెడుతుంది. ఇప్పటికే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
దరఖాస్తులను సెప్టెంబర్ తొలి వారంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలిస్తుంది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురి నుంచి అయిదుగురి పేర్లతో జాబితా రూపొందించనుంది. ఈ లిస్టును స్క్రీనింగ్ కమిటీ వడపోసి ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఏదైనా నియోజకవర్గంలో ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉంటే చివరిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సెప్టెంబర్ రెండోవారంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.