BRS Party ( Latest Telangana Updates ) : తెలంగాణలో అధికార పార్టీ BRSలో టికెట్ల పంచాయితీ రచ్చ రేపుతోంది. దాదాపు చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు రెండు, మూడు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు భగ్గుమంటోంది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న వాళ్లు కూడా టికెట్ కోసం రచ్చకెక్కుతున్నారు. టికెట్ తమకు ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నారు. అధిష్ఠానానికి రిక్వెస్టులు పెట్టుకోవటం కంటే క్షేత్రస్థాయిలో బల ప్రదర్శన చేసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఇక మరికొందరు నేతలైతే ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ బలాల్ని చాటుకోవడంతోపాటు అవతలి వ్యక్తి బలహీనతలే అస్త్రాలుగా దెబ్బకొడుతున్నారు. మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పద్మక్క వద్దు..కేసీఆర్ ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. పద్మా దేవేందర్ రెడ్డికి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చిన మద్దతు ఇస్తామంటున్నారు కార్యకర్తలు. అయితే మైనంపల్లి వర్గీయులే కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు.
జనగామ జిల్లాలో బీఆర్ఎస్ వర్గాల ఫైట్ రచ్చ రేపింది. జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గం.. టికెట్ తమ నాయకునికే ఇవ్వాలంటూ ఆందోళనకు దిగింది. అక్కడి నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అధిష్ఠానం వద్ద తనకు ఉన్న పలుకుబడితో టికెట్ సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో నిరసన ప్రదర్శనకు దిగింది ముత్తి రెడ్డి వర్గం. టికెట్ తనకే కేటాయించాలంటూ ముత్తిరెడ్డి సైతం కన్నీరు పెట్టుకున్నారు. కార్యకర్తలతో భావోద్వేగంగా మాట్లాడారు. తన కోసం కన్నీరు పెట్టుకున్న కార్యకర్తలను ఓదార్చారు.
అటు జనగామ జిల్లాలోనే ఉన్న స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య రాజకీయ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కడియం వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండ జిల్లా వేలేరులో రాజయ్య వర్గీయుల ర్యాలీ నిర్వహించారు. కడియం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కడియం వద్దు రాజయ్య ముద్దు అంటూ నినాదాలు చేశారు.
భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్లోనూ అసమ్మతి రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రకు టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ గండ్ర వెంకటరమణా రెడ్డికి టికెట్ ఇస్తే… నామినేషన్ వేసేందుకు 150 మంది తెలంగాణ ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే గండ్రపై ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గీయులు తిరుగుబాటు చేస్తామంటున్నారు. మధుసూదనాచారికి టికెట్ కేటాయించాలంటూ ఏకంగా సెల్ టవర్ ఎక్కారు అనుచరులు. దీంతో గులాబీ బాస్కు భూపాలపల్లి టికెట్ సమస్య మరో తలనొప్పిగా మారింది.
ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… ఇల్లందు నియోజకవర్గం బీఆర్ఎస్ లో ఇంటి పోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ నాయకులే ఆమె తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం గురించి తెలుసుకున్న హరిప్రియ.. తన అనుచరులతో మంత్రి హరీష్ రావుతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పుట్టా మధుకు వ్యతిరేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా అసమ్మతి రాజుకుంది. మధుకు టికెట్ ఇవ్వొద్దని బాహాటంగానే విమర్శలు, విన్నపాలు వస్తున్నాయి. మంథని, కాటారం, ముత్తారం ఇలా పలు మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచ్లు మధుకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఈసారి ఆయనకు మంథని టికెట్ ఇవ్వొద్దని.. ఒకవేళ ఇస్తే సహకరించేది లేదని అధిష్టానానికి తెగేసి చెబుతున్నారు. మధు పార్టీ లైన్లో కాకుండా వ్యక్తిగత ఎజెండాతో వెళ్తున్నారనేది వారి వాదన. మరోవైపు భూపాలపల్లి జిల్లా కాటారం పీఏసీఎస్ ఛైర్మన్ చల్లా నారాయణరెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో ఆయన టచ్లో ఉంటున్నారు.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ ఇష్యూ ఆసక్తికర టర్న్ తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు టికెట్ వస్తుందని అంతా భావిస్తున్న సమయంలో… ఆయన ఓ మహిళతో రాసలీలలు చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే వైరా బీఆర్ఎస్ టికెట్ మదన్ లాల్కే వస్తుందని.. అది తట్టుకోలేక కుట్రపూరితంగా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం ఇటువంటి ఫోటో మార్ఫింగ్ చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆ ఫోటోలు నిజం కాదని అవి మార్ఫింగ్ ఫోటోలని అంటున్నారు.
ఇక నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ టికెట్పైనా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సాగర్లో నోముల భగత్కు ఈ సారి టికెట్ దక్కకపోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థానంలో కంచర్ల చంద్రశేఖర్రెడ్డికి టికెట్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బల ప్రదర్శన చేస్తున్నట్టు తెలుస్తోంది. చింతపల్లిలో నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ సెంటర్ను అల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభించారు. తాను పోటీ చేస్తే అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని కూడా ప్రకటించేశారు చంద్రశేఖర్ రెడ్డి. ఇలా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లో టిక్కెట్ల లొల్లి నడుస్తోంది.