Smoke In The Building : సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగి రెండురోజులు అయినా దక్కన్ మాల్ భవనంలో వేడి సెగలు ఇంకా చల్లారలేదు. భవనం నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది భవనం లోపల ఫోమ్ చల్లి పూర్తిగా ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని అధునాతన స్కానర్లతో క్లూస్ టీమ్ పరిశీలిస్తోంది.
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటికీ సముదాయంలో దట్టంగా పొగ వ్యాపించి ఉందని క్లూస్ టీమ్ హెడ్ వెంకన్న తెలిపారు. లోపలికి వెళ్లేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు. ఒక్కసారి లోపలికి వెళ్లగలిగితే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
మరోవైపు సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , అగ్నిమాపకశాఖ అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ, సీపీఎం నాయకులు పరిశీలించారు. నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ దక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతకు GHMC ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నిట్ నివేదిక ఆధారంగా కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తోంది. మాలిక్ డిమాలిషింగ్ సంస్థలకు కూల్చివేత పనులు అప్పగించింది. బిల్డింగ్ కూల్చివేతకు 3 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భవనంలో వేడి చల్లారిన తర్వాత ఈ పనులు చేపట్టనున్నారు. అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పక్క భవనాలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా కూల్చేవేత పనులు చేపట్టనున్నారు.