బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ టిక్కెట్ దగ్గని నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు. అందులో ఇద్దరు కీలక నాయకులకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నారని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారని సమాచారం. బుధవారం తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగుతోంది. మంత్రివర్గంలోకి కొత్తగా ఇద్దరికి ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు. పట్నం మహేందర్ రెడ్డితోపాటు కామారెడ్డి సీటు కోల్పోయిన గంప గోవర్ధన్ ను కూడా కేబినెట్ లో తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ కేబినెట్ లో గరిష్టంగా 18 మందికి స్థానం దక్కుతుంది. ఇప్పటికే కేబినెట్ లో 17 మంది ఉన్నారు. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయడంతో ఒక స్థానం ఖాళీ అయ్యింది. ఈటల బీసీ నేత కాబట్టి ఆ స్థానంలో మరో బీసీ నేత గంప గోవర్ధన్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. పట్నం మహేందర్ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కాలంటే మరొకరిని తప్పించాలి. అందుకే మంత్రి మల్లారెడ్డిపై వేటు వేస్తారని వార్తలు వస్తున్నాయి. సామాజిక సమీకరణాల లెక్కలు వేసే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మల్లారెడ్డి స్థానంలో పట్నంకు మంత్రిపదవి దక్కుతుందంటున్నారు.
కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ కు ఈ సారి టిక్కెట్ దక్కలేదు. అక్కడ సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. అందుకే గోవర్ధన్ కు మంత్రి పదవి ఆఫర్ చేశారని టాక్. తాండూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పట్నం మహేందర్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి కారెక్కారు.
ఇప్పుడు రోహిత్ రెడ్డికే తాండూరు టిక్కెట్ దక్కింది. ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోకుండా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వబోతున్నారని చర్చ నడుస్తోంది. ఎందుకంటే కొంతకాలం క్రితం పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం సాగింది. ఆయన కాంగ్రెస్ లోకి వస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారం మొదలుకాగానే బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఆయనతో చర్చలు జరిపింది. ఇప్పుడు టిక్కెట్ ఇవ్వకపోవడంతో మంత్రి పదవి ఇచ్చి ఆయన పార్టీ మారకుండా కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు.