Vanama : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తుదిపరి విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది.
తెలంగాణ హైకోర్టు తన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.
2018 ఎన్నికల సమయంలో వనమా అఫిడవిట్లో ఫామ్– 26లో వాస్తవ సమాచారం పొందుపరచలేదని ప్రధాన అభియోగం. అలాగే ప్రభుత్వానికి ఉన్న బకాయిలను సరిగా చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వనమా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు నాలుగేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. చివరికి వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. అయితే సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లే వరకు స్టే విధించాని వనమా కోరారు.ఈ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వనమా హాజరుకాలేదు. 2018 ఎన్నికల్లో వనమాపై ఓడిపోయిన జలగం వెంకట్రావును హైకోర్టు ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసింది. దీంతో ఆయన తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. హైకోర్టు తీర్పు కాపీలను అందించారు. అయితే ఇంకా దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నిర్ణయం తీసుకోలేదు. దీంతో జలగం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. ఈ నేపథ్యం తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం నుంచి ఇద్దరిలో ఎవరూ హాజరుకాలేదు.