Hyderabad News(Telangana Updates): సంపన్న నగరాల జాబితాలో ప్రపంచలో 65 స్థానంలో ఉన్న హైదరాబాద్ మరో మైలురాయిని చేరుకుంది. భాగ్యనగరం జనాభా కోటి దాటేసింది. ప్రస్తుతం నగరంలో 1.05 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 1.08 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో దేశంలో 6వ స్థానం, ప్రపంచంలో 34వ స్థానంలో హైదరాబాద్ ఉంది.
1950లో హైదరాబాద్ జనాభా 10 లక్షలు మాత్రమే. ఆ తర్వాత పాతికేళ్లలో రెట్టింపై.. 1975 నాటికి జనాభా 20 లక్షలు దాటింది. 1990నాటికి 40 లక్షలకు చేరింది. 2010 నాటికి జనాభా 80 లక్షలు దాటింది. ఏటా 5 లక్షల మంది ఉపాధి కోసం భాగ్యనగరానికి వలస వస్తున్నారు. వారిలో చాలామంది ఇక్కడే స్థిరపడుతున్నారు. వారిలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య ఏటా సగటున 4.07 లక్షలుగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏటా సగటున 88,216 మంది హైదరాబాద్ కు ఉపాధి కోసం వస్తున్నారు.
హైదరాబాద్ జనాభాలో 14 ఏళ్లలోపు పిల్లలు 25 శాతం ఉన్నారు. 60 శాతంపైగా జనాభా 15 నుంచి 64 ఏళ్ల మధ్యలో ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ ఎంసీహెచ్ పరిధిలోని ఉండేది. అప్పుడు 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే నగరం ఉంది. జీహెచ్ఎంసీ ఏర్పాటుతో 650 చదరపు కి.మీ. పరిధికి నగరం విస్తరించింది. అవుటర్ రింగ్రోడ్డు వరకు పరిగణనలోకి తీసుకుంటే భాగ్యనగరం విస్తీరణం వెయ్యి చదరపు కిలోమీటర్లు అవుతుంది.
హైదరాబాద్ ఫార్మా, ఐటీ హబ్ గా మారింది. ఈ రెండు రంగాల్లో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే చదువులు పూర్తికాగానే తెలుగురాష్ట్రాల నుంచి ఎక్కువ మంది యువత హైదరాబాద్ కే వచ్చేస్తున్నారు. ఇక్కడే ఉద్యోగాలు సాధించి స్థిరపడుతున్నారు. అందుకే నగర జనాభాగా బాగా పెరిగింది.