Telangana Weather Report: ఈ ఏడాది రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విపరీతమైన ఎండలు, వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా వాతావరణ శాఖ చల్లటి కబురు తెలిపింది. రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. రాష్ట్రం అంతటా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ తరుణంలోనే పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఉపరిత ఆవర్తనంతో నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ లో ఈ రోజు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే తెలిపింది. ఈ తరుణంలో ఆకాశం అంతా ఒక్కసారిగా నల్ల మబ్బులు కమ్మేసాయి. మధ్యాహ్నం అంతా విపరీతమైన ఎండతో వేడిగాలులు వీయగా.. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం చల్లబడింది. అయితే ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తరుణంలో వాతావరణ శాఖ సూచనతో ఇప్పటికే జీహెఎంసీ కూడా అప్రమత్తమైంది.