Telangana Weather Alert (weather news today Telangana): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు సూరీడు సుక్కలు సూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే కాలు బయట పెట్టాలంటే జనాలు వణికిపోతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వేడి గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నగరంలోను ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు 42-43°C దాటే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
రెండు రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్ర ప్రజలు అస్సలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఉత్తర తెలంగాణలో ఈ వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. అవసరమైతే తప్ప అస్సలు బయటకు వెళ్లకూడదని, లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని తెలిపింది. కాగా, ఏప్రిల్ 7 తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Also Read: Weather News Today : చల్లటి కబురు.. రేపట్నుంచి వర్షాలు.. హైదరాబాద్ లో మాత్రం ?
కాగా, ఈ ఏడాది ఎండలు మార్చి నెల కంటే కాస్త ముందుగానే మొదలైన విషయం తెలిసిందే. 2016 తర్వాత ఈ ఏడాదే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు వేడి ఎక్కువగా ఉంటుందట. పిల్లలు, వృద్ధులు ఈ సమయాల్లో అస్సలు బయటకు రాకూడదని తెలిపారు.