Nagarjuna sagar : భారతదేశంలో బహుళార్థక సాధక ప్రాజెక్టులన్నీ జాతీయ ఆస్తులుగా పరిగణిస్తారు. దీనిమీద చేయి వేసినా, వాటి జోలికెళ్లినా దేశ భద్రతా నేరంగానే పరిగణిస్తారు.
భారతదేశంలో మొత్తం 16 బహుళార్థక సాధక ప్రాజెక్టులున్నాయి. వీటన్నింటిని జాతీయ ఆస్తులుగా పరిగణిస్తారు. అంటే ప్రాజెక్టులు దేశ సంపదగా కీర్తిస్తారన్నమాట. అలాంటి వాటిని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాల్సిన బాధ్యతలున్నాయి.
ఇలా ప్రాజెక్టుల మీదకి వెళ్లడం, అక్కడ బ్యారికేడ్లు పెట్టడం, ధర్నాలు చేయడం లాంటివి నిషేధం అన్నమాట. అంతటి తెలంగాణ మహోద్యమం జరిగిన కాలంలోనే ప్రాజెక్టు దగ్గరకి ఒక్క ఆందోళనకారుడు కూడా జెండా పట్టుకు వెళ్లలేదనే సంగతిని గుర్తు చేస్తున్నారు. మరీ సంగతి ఏపీ పోలీసులకు తెలీదా? అని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
భారతదేశంలో ఉన్న భారీ నీటి పారుదల ప్రాజెక్టులు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి భాక్రానంగల్ ప్రాజెక్టు అయితే, రెండవది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. 10 వేల హెక్టార్లు లేదా అంతకుమించి ఆయకట్టు సాగు అయ్యే ప్రాజెక్టులను భారీ నీటి పారుదల ప్రాజెక్టులు అంటారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుని కృష్ణానదిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నందికొండ వద్ద నిర్మించారు. ప్రస్తుతం ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఈ ప్రాజెక్టుని 1955లో అప్పటి ప్రధాని నెహ్రూ డిసెంబర్ 10న శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.1967లో ఇందిరాగాంధీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు.
ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లో నాగార్జునసాగర్ డ్యాం పొడవు, ఎత్తుల్లో ప్రథమస్థానంలో ఉండటం విశేషం. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. 285 చ.కి.మీ. విస్తీర్ణంతో 408 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సేవలిందిస్తోంది. అటు సాగు నీటికి, ఇటు జలవిద్యుద్ ఉత్పత్తి చేసే కేంద్రంగా కూడా ఉపయోగపడుతోంది.
ఇది ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన రాతికట్టడంగా పేరుపొందింది. దీని కుడికాలువను జవహర్ లాల్ కాలువ అని, ఎడమ ప్రధాన కాలువను లాల్ బహుదూర్ శాస్త్రి కాలువగా పిలుస్తారు. ఇప్పుడు కుడి కాలువలు ఏపీ వైపున ఉన్నాయి. అందుకని అటువైపున 13 గేట్లను ఏపీ పోలీసులు తమ స్వాధీనంలోనికి తీసుకున్నారు.
సాగర్ డ్యామ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహణలో ఉంది. ఎస్పీఎఫ్ బలగాలు డ్యామ్ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే, ఏపీ పోలీసులు సాగర్ డ్యామ్పైకి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీనిని ఎస్పీఎఫ్ బలగాలు వ్యతిరేకించాయి.
సాగర్ ప్రాజెక్టు కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 20 లక్షల ఎకరాలకు సాగు, తాగు నీరు అందుతోంది. కాకపోతే ప్రాజెక్టుకి కాల్షియం వల్ల ముప్పు ఏర్పడుతోంది. జలాశయం లోపలి గోడల రంధ్రాల్లో పేరుకుపోయిన కాల్షియం వల్ల డ్యాం స్పిల్ వేతో పాటు, గ్యాలరీలోని గోడలకు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
అంతేకాదు ప్రాజెక్టుపై ఒకేసారి అధికసంఖ్యలో వెళ్లడానికి బరువులు పెట్టడానికి లేదు. నీటి విడుదల సమయంలో కూడా ప్రజలని ఇష్టం వచ్చినట్టు పంపించరు. నెమ్మదిగా పంపుతారు. అలాంటిది ఇప్పుడు పోలీసులు వందల సంఖ్యలో అక్కడ చేరి, బరువైన బ్యారికేడ్లు పెట్టడంతో సీనియర్ ఇంజనీర్లు డ్యాం భద్రతపై భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఆనకట్టకు ఇరువైపులా దక్షిణ విజయపురి (గుంటూరు జిల్లా), ఉత్తర విజయపురిలో భాగంగా పైలాన్ (ఉమ్మడి నల్గొండ జిల్లా), హిల్ కాలనీ ఉన్నాయి. ఇదే టూరిజం ప్రాంతంగా ఉంది. నాగార్జున సాగర్ పర్యాటకులకు ఇక్కడే వసతి గృహాలు, భోజన వసతి సౌకర్యాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా ఉద్రిక్తపూరితంగా ఉంది.