Fake Doctor : అతడు టెన్త్ కూడా పాస్ కాలేదు. కానీ పదేళ్లుగా డాక్టర్గా చలామణి అవుతున్నాడు. ఆ నకిలీ వైద్యుడి బాగోతాన్ని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. కోల్కతాకు చెందిన ఆకాశ్ కుమార్ బిశ్వాస్ పదో తరగతి కూడా ఉత్తీర్ణత కాలేదు. కొంతకాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నాడు. పదేళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లిలో ప్రియాంక పేరుతో క్లినిక్ను ప్రారంభించాడు.
ఇండియన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ పేరిట బోర్డు పెట్టుకున్నాడు ఆకాశ్ కుమార్ బిశ్వాస్. రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులతో చికిత్సలు అందిస్తున్నాడు. సాధారణ రోగాలతో వచ్చేవారికి చికిత్స చేస్తూ పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసేవాడని ఆరోపణలున్నాయి. పైల్స్, ఫిషర్, పిస్టులా, హైడ్రోసీల్ లాంటి సమస్యలకు ఆపరేషన్ లేకుండా వైద్యం చేస్తానని చెప్పేవాడు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న రోగులను కమీషన్ ప్రాతిపదికన వరంగల్, హన్మకొండలోని వివిధ ఆసుపత్రులకు పంపించేవాడని స్థానికులు చెబుతున్నారు.
ఆకాశ్ కుమార్ బిశ్వాస్ నకిలీ వైద్యదందాపై టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వరంగల్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు, ఘన్పూర్ పీహెచ్సీ వైద్యులు.. ఆ క్లినిక్ లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నరేష్కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రావణ్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో సుధీర్, వైద్యాధికారులు సాంబయ్య, భాస్కర్ పాల్గొన్నారు. అతని వద్ద వైద్య అనుమతులు, విద్యార్హత పత్రాలు లేనట్లు గుర్తించారు. వివిధ పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. ఆకాశ్ కుమార్ బిశ్వాస్ పై కేసు నమోదు చేసి, స్థానిక పోలీస్స్టేషన్ కు తరలించారు. నకిలీ వైద్యుడిని పట్టుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిని అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.
ఆకాశ్ కుమార్ బిశ్వాస్ పదేళ్లలో 3,650 మందికి పైగా రోగులకు చికిత్సలు అందించినట్లు పోలీసులు వెల్లడించారు.