Boy Dead : ఆ తండ్రి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల కోసం వారు ఎంతో ఇష్టపడే చాక్లెట్లు తెచ్చారు. కానీ ఆ చాక్లెట్ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది.
రాజస్థాన్కు చెందిన కంగర్సింగ్ బతుకుతెరువు కోసం వరంగల్ వచ్చారు. నగరంలోని డాల్ఫిన్ గల్లీలో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. స్థానిక శారద పబ్లిక్ స్కూల్లో ముగ్గురు చిన్నారులు చదువుతున్నారు. ఇటీవల కంగర్సింగ్ ఆస్ట్రేలియా వెళ్లి తిరిగొచ్చారు. శనివారం పిల్లలు స్కూల్కు వెళ్లే సమయంలో విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్ను వారికి ఇచ్చారు.
రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్ (8) స్కూల్కు వెళ్లి చాక్లెట్ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది తండ్రికి సమాచారం అందించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గొంతులో చాక్లెట్ను వైద్యులు గుర్తించారు. చికిత్స అందిస్తుండగానే సందీప్ మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.