Summer : సమ్మర్ సీజన్ ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో మరో 4 రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 3 వరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్, సిద్ధిపేట, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్నగర్, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి, కుమురంభీం-ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లోనూ 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
ఆరెంజ్,యెల్లో వార్నింగ్..
మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు ఏడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్ విడుదల చేసింది.
ఉష్ణోగ్రతలు 35.9 డిగ్రీలను దాటితే..
సాధారణం వాతావరణ శాఖ 3 రకాలు వార్నింగ్ లు ఇస్తుంది. ఉష్టోగ్రత 36-40 డిగ్రీల మధ్య ఉంటే యెల్లో వార్నింగ్, 41-45 డిగ్రీల మధ్య ఉంటే ఆరెంజ్ వార్నింగ్, 45 డిగ్రీలపైన ఉంటే రెడ్ అలెర్ట్ సంకేతాలను జారీ చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరెంజ్ హెచ్చరికల స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆరుబయట పని చేసే వారు, ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. బీ కేర్ ఫుల్..