Smita Sabharwal : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన కేసులో ఇద్దరు నిందితులను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డితోపాటు అతని స్నేహితుడు బాబును అదుపులోకి తీసుకున్నారు. అక్రమ చొరబాటు, న్యూసెన్స్ కింద వారిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను జడ్జి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు నిందితులు ఆనంద్ , బాబును
చంచల్గూడ్ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిదంటే..?
మేడ్చల్ జిల్లా పౌరఫరాశాఖ కార్యాలయంలో ఆనంద్ కుమార్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా స్మితా సబర్వాల్ ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన ఓ హోటల్ యజమాని బాబును వెంట తీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్కు వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం స్మితా సబర్వాల్ ఇంట్లోకి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్ డోర్ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు తట్టాడు. డోర్ తెరిచిన స్మితా రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో నివ్వెరపోయారు. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించారు. బయటికి వెళ్లాలని గట్టిగా చెబుతూ కేకలు వేసినట్లు తెలుస్తోంది. ఈలోపు భద్రతాసిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అందుకే వెళ్లా..!
తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని స్మితా సబర్వాల్ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని ఆనంద్ కుమార్ రెడ్డి పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను యూసుఫ్గూడ పోలీస్ లైన్స్లోని ప్లెజెంట్ వ్యాలీలోని ఐఏఎస్ క్వార్టర్స్ వద్దకు వెళ్లినట్లు వివరించాడు. అయితే అపాయింట్మెంట్ లేకుండా రాత్రి పూట ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి వెళ్లడంపై పోలీసులు అరెస్టు చేశారు.