TGPSC Group 1 Mains Exam: తెలంగాణలో తొలి రోజు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఈ పరీక్షలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షకు మొత్తం 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అయితే మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని, రీ షెడ్యూల్ విడుదల చేయాలని కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టుకు సైతం వెళ్లారు. కానీ సుప్రీంకోర్టు ఎగ్జామ్స్ నిర్వహణకు మొగ్గు చూపింది. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షల రీ షెడ్యూల్, జీఓ 29 రద్దుపై గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను న్యాయస్థానం తిరస్కరించింది.
మెయిన్స్ పరీక్షల నిర్వహిణలో హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలు స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. దీంతో తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరిగాయి. మరోవైపు పరీక్షలను వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే అన్ని కేంద్రాల్లో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు.
అంతకుముందు, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ‘గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలి. ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పున:నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’. సీఎం ఆకాంక్షించారు.