TGO President Mamata : తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన మొదలుపెట్టారు. మొన్నటివరకు IAS, IPSల బదిలీలు పూర్తయ్యాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీలో ప్రక్షాళన ప్రారభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కీలక స్థానాల్లో పాతుకుపోయిన అధికారులకు ప్రభుత్వం షాకిచ్చింది. వారందరినీ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్ఎంసీలోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను బదిలీ చేసింది. అలానే శేరిలింగంపల్లి జడ్సీ శ్రీనివాస్రెడ్డిని ఆయన మాతృ సంస్థ చేనేత, జౌళిశాఖకు పంపించింది. ఖాళీ అయిన ఈ 2 స్థానాలను ఐఏఎస్ అధికారులతో భర్తీ చేస్తూ పురపాలకశాఖ ఆదేశాలిచ్చింది. బల్దియాలో ఆస్తిపన్ను, ఆరోగ్యం, ఐటీ విభాగాల అదనపు కమిషనర్గా పనిచేస్తున్న స్నేహ శబరీష్ను శేరిలింగంపల్లికి, ఇటీవల జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చిన అభిలాష అభినవ్ను కూకట్పల్లి జడ్సీగా పంపుతూ ఉత్తర్వులు జారీచేసింది.
చాలాకాలంగా జీహెచ్ఎంసీలో ఉపకమిషనర్ డీసీగా, జడ్సీగా బాధ్యతలు నిర్వర్తించిన మమత గత ప్రభుత్వంలో ఉద్యోగుల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ.. పదవులు, పదోన్నతులు వేగంగా పొందారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ఉన్నతాధికారులు ఆమెను కూకట్పల్లి జోన్ నుంచి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా బదిలీ చేయగా.. గంట వ్యవధిలోనే ఆ ఉత్తర్వులు రద్దై అదే పోస్టులో కొనసాగారు. అనంతరం కూకట్పల్లి జోన్లో అధికారుల బదిలీల్లో మమత సిఫార్సులను ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకునేవారని చెబుతుంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకాగానే టీజీవో అధ్యక్షురాలిగా మమత సీఎం రేవంత్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాజా బదిలీల్లో ఆమెను ప్రాధాన్యం లేని ఎన్ఐయూఎం-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్కు పంపుతూ ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశమైంది.
జీహెచ్ఎంసీ పరిధిలో పలు సర్కిళ్ల ఉన్నతాధికారులకూ స్థానచలనం కల్పిస్తూ కమిషనర్ రొనాల్డ్రాస్ ఉత్తర్వులు జారీచేశారు. ఫలక్నుమా సర్కిల్లో ఎన్నికల ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్రెడ్డిని అదే సర్కిల్ ఉపకమిషనర్గా నియమించారు. ఆ స్థానంలోని డి.లావణ్యను అదే సర్కిల్లో సహాయ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు. సంతోష్నగర్ సర్కిల్ డీసీ వి.నరసింహను కుత్బుల్లాపూర్ సర్కిల్కు, అక్కడి డీసీ ఎ.నాగమణిని సంతోష్నగర్కు పంపారు. జీహెచ్ఎంసీ ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎల్.సరితను చార్మినార్గా డీసీగా, ఆ స్థానంలోని ప్రస్తుత డీసీ డాకునాయక్ను కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వు జారీచేశారు.