Hyderabad : హైదరాబాదులో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. భాగ్యనగరంలో మరోసారి ISKP ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేశారు. సూరత్కు చెందిన సుబేరా బాను, శ్రీనగర్కు చెందిన నాజిర్, హయత్, అజీమ్లతో కలిసి ఓ గ్రూపుగా ఏర్పడినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడమే వీరి లక్ష్యంగా పనిచేస్తున్నారని ATS గుర్తించింది.
ఓల్డ్ సిటీ వేదికగా ఉగ్ర కార్యకలాపాలు నడిపేందుకు ప్రయత్నించిన సూరత్ కు చెందిన సుమేరా బానుని ఇటీవల ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమేరా బాను.. ఐసీస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావీన్సీలో చేరింది. అబు హంజాలా అనే ఉగ్రవాది విదేశాల నుంచి సుమేరా బానుకి హ్యాండ్లర్ గా ఉన్నాడు.
మంగళవారం రాత్రి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు హైదరాబాద్, రామగుండంలో తనిఖీలు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు టోలీచౌక్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న మరొకరు హైదరాబాద్లోని అమీర్ పేట్లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ లో సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రీ కూతుళ్లు టోలీచౌక్ లో ఉంటున్నారు. అయితే వీరు బక్రీద్ కోసం గోదావరిఖనికి వెళ్లినట్లు తెలుస్తోంది. అమీర్ పేటలోని పలు కోచింగ్ సెంటర్లపై ఏటీఎస్ బృందం తనిఖీలు చేసింది. కోచింగ్ పేరుతో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారనే అనుమానాలతో కోచింగ్ సెంటర్లలో తనిఖీలు చేసింది.
ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరపాలని పథకం వేసినట్లు విచారణలో తేలింది. ఇందుకోసం హైదరాబాద్ కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మెడికల్ షాప్ యజమానితో కాంటాక్ట్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా ఆ షాపు యజమానితో పరిచయం చేసుకుని.. హైదరాబాద్లో తనకు ఒక ఉద్యోగం ఇప్పించమని కోరినట్లు విచారణలో వెల్లడైంది. వ్యాపారితో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడినట్లు విచారణలో గుర్తించారు. దీంతో ఏటీఎస్ అధికారులు నిన్న హైదరాబాద్ చేరుకొని కాలాపత్తర్ లో ఉన్న వ్యాపారి ఇంటికి వెళ్లి సుమేరా కేసులో సాక్షిగా అతని వాంగ్మూలం తీసుకున్నారు. భర్త నుంచి 2021లో విడిపోయిన సుమేరా బాను.. ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలయ్యింది.
దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించిన సుమేరా.. హైదరాబాద్ లో కూడా నడిపించాలని ప్రయత్నం చేసింది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమేరా ప్లాన్స్ ఏంటి? హైదరాబాద్ రావాలని ఎందుకు అనుకుంది? ఇక్కడకు వచ్చేందుకు ఎవరితో అయినా సంప్రదింపులు జరిపిందా? ఈ ఉగ్రవాదంలోకి ఇంకెవరినైనా లాగే ప్రయత్నం చేసిందా? అనే విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నాయి గుజరాత్ నిఘా వర్గాలు. మరోవైపు గుజరాత్ ఏటీఎస్ అధికారుల కస్టడీలో ఉన్న సుమేరాను విచారించేందుకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం వెళ్లనుంది. ఉగ్ర సంబంధాలపై ఆమెను ప్రశ్నించనున్నారు.