తెలంగాణలో ఎన్నికలు క్లైమాక్స్ కు వస్తున్నాయి. డిసెంబర్ లోపే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పదేళ్లలో ఏం చేశామో.. ఆన్ రికార్డ్ గా సర్కార్.. ఏం చేయలేదో చెప్పేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. సభా సమరంలో తేల్చుకోవాలనుకుంటున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు జరిగే శాసనసభా సమావేశాలు ఇవే చివరివి కావడంతో పాలిటిక్స్ గరంగరంగా మారాయి. విపక్షాలపై సంధించేందుకు భారీ అస్త్రాలను కేసీఆర్ రెడీ చేసుకున్నారు. ఇంతకీ కేసీఆర్ ఎలా కార్నర్ చేయబోతున్నారు?
గురువారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంటోంది. రెండో టర్మ్ లో ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ సెషన్. అందుకే ఆన్ రికార్డ్ గా గత పదేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు కేసీఆర్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. అయితే ఈ సమావేశాలు జరిగేది కొద్ది రోజులే అయినా గత నాలుగేళ్ల వాడి వేడి ఇప్పుడే కనిపించబోతుందంటున్నారు. ఎలక్షన్లు ముంచుకొస్తుండడమే ఇందుకు కారణం.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అధికార పార్టీ డీల్ చేయబోతోందంటున్నారు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేయాలి.. పదేళ్ల అభివృద్ధిని ప్రజలకు చెప్పాలి… అనుకున్నది సాధించాలన్న టార్గెట్ తో అసెంబ్లీ సమావేశాలకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. అవును ఇప్పటి వరకు చేసింది చెప్పుకుంటే చాలు.. కొత్తది చెప్పుకోనవసరం లేదు అని ఇది వరకే సీఎం కేసీఆర్ తమ పార్టీ ప్రజాప్రతినిధులకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని వర్కవుట్ చేసే పనిలో పడ్డారు.
తెలంగాణ ఏర్పడ్డాక అసెంబ్లీ సమావేశాల సభా సమయం తగ్గుతూ వస్తోంది. ఎక్కువ రోజులు పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ అలా జరగడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వకుండా అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై విపక్ష పార్టీలను ఎండగట్టడం కోసం బీఆర్ఎస్ రెడీ అవుతోంది. గవర్నర్ తమిళిసై కొన్ని బిల్లుల్ని పెండింగ్ లో పెట్టడం, తిప్పి పంపడం విషయంపై బీజేపీని టార్గెట్ గా చేసుకుని బీఆర్ఎస్ విరుచుకుపడే అవకాశం ఉంది. గవర్నర్ తిప్పి పంపిన బిల్లుల్లో యూనివర్సిటీల్లో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు కూడా ఉంది. మళ్లీ ఈ బిల్లును తెలంగాణా అసెంబ్లీలో పెట్టనున్నారు.
మంత్రివర్గ భేటీ తర్వాత కేటీఆర్ కూడా పెండింగ్ బిల్లులపై మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలపై గవర్నర్ రియాక్ట్ అయ్యారు. తాను కొన్ని బిల్లులను ఆమోదించానని, అసలు బిల్లులను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో కారణంతో సహా చెప్పానన్నారు. తాను తెలంగాణలో ఎవరికీ వ్యతిరేకం కాదని, అసలు బిల్లులను తిరస్కరించి, వెనక్కి పంపాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు గవర్నర్. కావాలనే కొందరు తనమీద ఎందుకు విషం చిమ్ముతున్నారో అర్థం కావడం లేదంటూ మాట్లాడారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను కూడా ఈ సమావేశంలో మరోసారి ఆమోదించనున్నట్లు తెలిసింది.
అటు వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇష్యూలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ధర్నాలు, నిరసనలు కూడా చేసింది. ఇదే విషయంపై సభలో చర్చకు పెట్టి, కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి ఒక అస్త్రాన్ని బీఆర్ఎస్ సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. నిజానికి కరెంట్ ఇష్యూలో బీఆర్ఎస్ ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం, సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లలో ఎక్కడా 24 గంటల కరెంట్ పై వివరాలు లేకపోవడంతో ఇష్యూ కాస్తా రివర్స్ లో బూమరాంగ్ అయింది. దీన్ని కవర్ చేసుకునేందుకు సమావేశాలను వేదికగా చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేయాలని అన్ని పార్టీలు భావిస్తుండంతో ఈ శాసనసభ సమావేశాలు ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారాయి. సెప్టెంబర్, లేదంటే అక్టోబర్ లో ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ సెషన్ గరంగరంగా జరగడం ఖాయమే. ఆగస్టు 18 తేదీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే ఉన్న పథకాలు, అందులో క్లిక్ అయిన వాటి గురించి ముఖ్యంగా రైతుబంధు వంటి వాటి గురించి మరోసారి అధకార పార్టీ సభా వేదికగా చర్చకు తీసుకువచ్చే అవకాశమైతే ఉంది.
ఇప్పటికే కేసీఆర్ సర్కార్ రెండు టర్మ్ లను పూర్తి చేసుకుంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్న వ్యూహాలతో ఉన్నారు. అయితే ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని అది సహజమే అన్న భావనలో గులాబీ వర్గాలు ఉన్నాయి. అయితే ఆ వ్యతిరేకతను కూడా అధిగమించే ప్లాన్స్ వేస్తున్నారు. ఈ సమావేశాల్లో కేసీఆర్ ఎవరిని టార్గెట్ చేస్తారు.. ఎలా చేస్తారన్న విషయాలు సస్పెన్స్గా మారాయి. అందుకే ఈ చివరి అసెంబ్లీ సమావేశాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం ఎంతలా అభివృద్ధి చెందిందన్న విషయాలపై సమావేశాల్లో అధికార పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. గతంలో బీజేపీ టార్గెట్గా రాజకీయం నడిపిన కేసీఆర్.. రూటు మార్చి కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూ వస్తున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు కేసీఆర్. నిధుల విషయంలో తెలంగాణను పట్టించుకోవడం లేదని, అన్యాయం చేస్తున్నారంటూ మోడీ సర్కార్ తీరును తప్పుబట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఫాంలోకి రావడంతో ఎవర్ని టార్గెట్ చేస్తారన్నది కీలకంగా మారింది. అది కూడా చివరి సెషన్ కావడంతో అందరి చూపు అసెంబ్లీ వైపే ఉంది.
సొంత పథకాలను ప్రస్తావిస్తూనే.. ప్రభుత్వ విజయాల గురించి చెప్పుకుంటూనే.. వరద నష్ట పరిహారం చెల్లింపు విషయం, విభజన హామీలపై కేంద్రాన్ని… ఉచిత కరెంట్ విషయంలో కాంగ్రెస్ ను కేసీఆర్ కార్నర్ చేసే అవకాశమైతే ఉంది. విపక్ష నేతలు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను, అందుకు కౌంటర్ ఇచ్చేందుకు సంబంధించిన వివరాల సేకరణలో బిజీ అయింది గులాబీ దళం. అసెంబ్లీ సమావేశాలను అసెంబ్లీ ఎన్నికలకు వేదికగా ఎలా ఉపయోగించుకోవాలన్న విషయంపై భారీగానే కసరత్తు చేస్తోంది అధికార పార్టీ. ఆత్మరక్షణలో పడడం కాకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడికే మొగ్గు చూపేలా సీన్ కనిపిస్తోంది. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే గత పరిస్థితులే రిపీట్ అవుతాయంటూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ మంత్రులు ఇప్పుడు సభా వేదికగా ఆ విషయాలపైనే మాట్లాడే అవకాశాలున్నాయంటున్నారు.
అటు కేంద్రం విభజన అంశాలపై ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చకపోవడం వంటి అంశాలను ప్రస్తావించి బీజేపీపై మాటల దాడి పెంచే అవకాశం ఉంది. గతేడాది రాష్ట్రంలో కురిసిన వరద నష్టంపై కేంద్రం అంచనా వేసినా నిధులు కేటాయించలేదన్న విషయాలను సభలో ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణపై 9 ఏళ్లుగా కేంద్రం నిర్లక్ష్య వైఖరితో ఉందని, తెలంగాణ నుంచి జీఎస్టీ రూపంలో భారీగా చెల్లిస్తున్నా తమ వాటా సరిగా రాకపోవడాన్ని కేసీఆర్ లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, దళితులకు 10 లక్షలు, బీసీలకు లక్ష, మైనార్టీలకు లక్ష, హైదరాబాద్లో మెట్రో విస్తరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వరంగల్, ఖమ్మం అభివృద్ధి, దివ్యాంగుల పెన్షన్ పెంపు, విద్యార్థులకు డైట్ చార్జీలు పెంపు వంటి అంశాలను సభలో వివరించనున్నారు. ప్రతి పథకాన్ని సుదీర్ఘంగా చర్చించడంతో పాటు ఎంతమంది లబ్ది పొందారన్న విషయాలను జనంలోకి సభా వేదికగా తీసుకెళ్లాలనుకుంటున్నారు.