Kamareddy : కామారెడ్డి జిల్లా బంద్ ఉద్రక్తతలకు దారితీసింది. కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లను పోలీసులు బ్లాక్ చేశారు. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని ప్రకటించారు. ఎలాంటి ఆందోళనకు అనుమతిలేదని స్పష్టం చేశారు. రైతుల ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో రైతు జేఏసీ, కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కామారెడ్డిలో ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా బంద్ పాటించాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రైతు జేఏసీ నాయకులు విద్యాసంస్థలను మూసివేయించారు. విద్యార్థులు సైతం జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాల చేస్తూ రోడ్లపైకి వచ్చారు.
రైతులకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మాస్టర్ ప్లాన్ను మారుస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం..రైతుల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. రైతుల భూముల్లో పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని షబ్బీర్ అలీ కోరారు.
కామారెడ్డి జిల్లాలో బంద్ నేపథ్యంలో కామారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బీబీపేట పోలీసు స్టేషన్కు తరలించారు. మరోవైపు.. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు మద్దతుగా కామారెడ్డిలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలో స్వచ్చందంగా వ్యాపారులు షాపులను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని బీజేపీ నేతలు తేల్చిచెప్పారు.
కామారెడ్డి పట్టణం గురువారం కూడా అట్టుడికిపోయింది. అన్నదాతలు కలెక్టరేట్ వద్దకు దూసుకుపోయేందుకు చేసిన ప్రయత్నంలో పలువురికి గాయాలయ్యాయి. రైతులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. కామారెడ్డి పురపాలక సంఘానికి పట్టణ ప్రణాళిక విభాగం నూతన మాస్టర్ప్లాన్ను రూపొందించే క్రమంలో పట్టణ పరిసర ప్రాంతాల్లోని 8 గ్రామాల్లోని 2,170 ఎకరాల సాగు భూములను పారిశ్రామిక జోన్లో చేర్చింది. కొందరు స్థిరాస్తి వ్యాపారులతో నాయకులు కుమ్మక్కై పచ్చని పొలాలను బృహత్ ప్రణాళికలో మార్పులు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రణాళికపై ఇప్పటివరకు 2,100 అభ్యంతరాలు ఇచ్చారు. సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పురపాలక మంత్రికి పంపారు. పురపాలక అధికారులకు 558 మంది రైతులు కోర్టు నోటీసులు పంపారు.