Telangana Bhavan: బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముట్టిడించేందుకు ప్రయత్నించడంతో అప్పటికే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణం పరస్పరం దాడులు చేసుకునేవరకు వెళ్లినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలను చెదరగొట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజుల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులను, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతుంది. ఇటు బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ వస్తున్నది. ఒకవైపు పాలనకు సంబంధించిన విషయాలు, మరో వైపు పార్టీలకు సంబంధించిన అంశాలపై ఈ రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఏ ఒక్క పార్టీ కూడా తగ్గడంలేదు. ఢీ అంటే ఢీ అంటున్నాయి ఈ రెండు పార్టీలు.
Also Read: మూసీ ప్రక్షాళనతో రాజకీయాలు.. తెర వెనుక రియల్టర్లు?
ఏ చిన్న అవకాశం దొరికినా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వదలడంలేదు. ఎప్పటికప్పుడు అధికార పార్టీపై ఫైరవుతూనే ఉంది. పలు అంశాల్లో కోర్టు వరకు కూడా వెళ్లింది. అందులో ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి. దీనిపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున యుద్ధమే చేస్తోంది. తమ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను ఏ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ నోరు జారిన విషయం తెలిసిందే. ఆ తరువాత మహిళలకు ఆయన సారీ చెప్పారు. అనుకోకుండా అలా అన్నాను తప్ప మహిళలంటే తనకు గౌరవమంటూ పేర్కొన్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అప్పుడు కూడా తెలంగాణ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. పార్టీలకు అతితంగా మహిళలకు కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన దిగి రాక తప్పలేదు. చివరకు సారీ చెప్పాల్సి వచ్చింది.
ఆ తరువాత జరిగిన ఇన్సిడెంట్ ఏమిటంటే.. అసెంబ్లీ పీఏసీ చైర్మన్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడంతో బీఆర్ఎస్ ఫైరయ్యింది. ఆ పోస్ట్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి గానీ, మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు ఏ విధంగా ఇస్తారంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్త ఇళ్ల వరకు వెళ్లి అక్కడ ఆందోళనలు చేసే పరిస్థితి వరకు వచ్చింది. దీంతో ఆ రెండుమూడురోజులు ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. వెంటనే అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఇటు అసెంబ్లీ స్పీకర్ ను కూడా కలిసి వినతి పత్రం అందించారు.
Also Read: సెలవు దినాల్లో ఎందుకు కూల్చుతున్నారు? హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు
ఇదిలా ఉంటే.. ప్రస్తుత సచివాలం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు విషయమై కూడా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తమ పాలనలో నిర్ణయం తీసుకున్నామని, అలా కాకుండా ఏ విధంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఏర్పాటు చేస్తున్నామంటూ వారి వ్యాఖ్యలకు అంతేఘాటుగా రిప్లై ఇచ్చింది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు పేర్కొనగా, కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ దమ్ముంటే ముట్టుకోండి అప్పుడు మేమేంటో చూపిస్తామంటూ కూడా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.