Kavitha: కవిత కేసు డైలీ సీరియల్లా ప్రతీ ఎపిసోడ్లోనూ ట్విస్టులు ఉంటున్నాయి. ఇప్పటికే ఓ దఫా ఈడీ విచారణ ముగిసింది. అప్పుడే అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ చేయలేదు. మళ్లీ పిలుస్తామన్నారు. ఈనెల 16న రావాలని నోటీసులు ఇచ్చారు. కవిత వెళ్లలేదు. తన తరఫున లాయర్ను పంపించారు. అయితే సరే, మళ్లీ 20న రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. ఇదే సమయంలో ఇంట్లోనే విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కవిత. 24న విచారణ జరపనుంది సుప్రీం. ఈ కేసులో ఈడీ సైతం కేవియట్ పిటిషన్ వేసింది. తమ వాదనలు వినకుండా తీర్పు ఇవ్వొద్దని సుప్రీంను కోరింది. ఇలా ఆసక్తికర పరిణామాల మధ్య 20వ తేదీ రానే వచ్చింది.
సోమవారం ఈడీ విచారణ. ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్లతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు కవిత. మరి, సోమవారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరే లాయర్ను పంపిస్తారా? కవిత డుమ్మా కొడితే ఈడీ ఊరుకుంటుందా? అరెస్ట్ చేస్తుందా? ఈనెల 24న జరగనున్న సుప్రీంకోర్టు విచారణ వరకు వెయిట్ చేస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు. అంతకుమించి ఉత్కంఠ.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అనుమానితురాలు అని ఇప్పటికే కోర్టుకు తెలిపింది ఈడీ. కవితకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించింది. అరుణ్ రామచంద్ర పిళ్లై.. కవిత బినామీ అని తేల్చింది. అడిటర్ బుచ్చిబాబు, పిళ్లైల సమక్షంలో కవితను ప్రశ్నించాలని భావించింది ఈడీ. కానీ, సుప్రీంకోర్టులో పిటిషన్ను సాకుగా చూపించి.. గత విచారణను తప్పించుకుంది కవిత. ఈడీ పక్కాగా పావులు కదుపుతుండటంతో.. ఈసారి కూడా గైర్హాజరు అయితే కుదిరేలా లేదు. అందుకే, ఎందుకైనా మంచిదని తన పరివారంతో కలిసి ఢిల్లీ అయితే వెళ్లారు. సోమవారం విచారణకు హాజరు అవుతారా? లేదా? కవితను అరెస్ట్ చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.