Temple Scam : అక్రమార్కుల అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. దేవుడన్న భయమూ లేదు. అడ్డగోలుగా దోచుకునేందుకు స్వామివారికే శఠగోపం పెడుతూ గుళ్లలోనూ స్కాంలకు పాల్పడుతున్నారు. దేవాలయానికి చెందిన దుకాణాల అద్దెను స్వాహా చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా గత రెండేళ్లుగా సాగుతున్న ఈ అవినీతి బాగోతంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మాచారెడ్డి మండలం గజ్యా నాయక్ తండాలో వీరహనుమాన్ వెంకటేశ్వర ప్రాచీన ఆలయం ఉంది. కొలిచిన వారికి కొంగు బంగారం నిలుస్తున్న స్వామివారి ఆలయానికి మాచారెడ్డికి చెందిన గంధం రాజగోపాల్ 2 ఎకరాల 5 గుంటల భూమిని దానంగా ఇచ్చారు. స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో గుడి ఆవరణలో 20 దుకాణాలు నిర్మించారు. ఈ దుకాణాలపై కొందరు బడా బాబుల కన్ను పడింది. వాటిని అక్రమంగా దక్కించుకున్నారు. అడ్వాన్స్ పేరుతో ఒక్కో దుకాణానికి 40 వేల నుంచి లక్ష రూపాయల నగదును నొక్కేశారు.
రెండేళ్లుగా ఈ అవినీతి బాగోతం నడుస్తున్నా దేవుడికే శఠగోపం పెట్టి అభివృద్ధికి కేటాయించాల్సిన సొమ్మును జేబులో వేసుకుంటున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ అవినీతిలో కొందరు నేతలకు కూడా వాటాలు అందాయనే విమర్శలున్నాయి.
రాష్ట్రంలో అధికారం మారి బీఆర్ఎస్ పెత్తనం పోవడంతో గ్రామస్తులు ధైర్యంగా గుడిలో దేవుడి పేరుతో జరగుతున్న అవినీతిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గుడి సొమ్మును కాజేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరాంజనేయ వెంకటేశ్వర ఆలయ అభివృద్దికి, దుకాణాల సముదాయాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని.. అయితే,.. ఈ సముదాయాలను తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్థానికుల ఫిర్యాదును స్వీకరించిన సర్కార్ అక్రమాలపై విచారణకు ఆదేశించింది. దీంతో అవినీతిపై ఆరా తీస్తున్నారు అధికారులు. దాతలు విరాళం ఇచ్చిన దేవుని భూమిపై ఎండో మెంట్కు పూర్తి హక్కులు ఉంటాయని.. ప్రైవేట్ వ్యక్తులు అద్దెలు తీసుకోవడం సరైంది కాదని ఆలయ ఈఓ చెబుతున్నారు. త్వరలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి దేవాదాయ శాఖ దుకాణ సముదాయాలను స్వాధీనం చేసుకుంటుందని ఆయన తెలిపారు.
.
.