Telangana Workers : పొట్టచేత పట్టుకుని.. ఉన్న ఊరు, కన్నవారిని వదిలి రాష్ట్రం కాని రాష్ట్రం దేశం కాని దేశం వెళ్లిన కార్మికులు గల్ఫ్ లో నానా అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల ఒప్పందం పై కార్మికులకు వీసాలు మంజూరు చేసింది. కానీ పనిలేదంటూ ఏడాదికే ఇంటికి వెళ్లాలని చేతులు ఎత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేసేదేంలేక స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఖతార్ దేశంలోని ఏషియానా కంపెనీలో క్లీనింగ్, సప్లయి పనులు చేసేందుకు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని గాంధీనగర్, ఖానాపూర్కు చెందిన 350 మంది పని కోసం వెళ్లిన గల్ఫ్ కార్మికులను స్వదేశాలకు వెనక్కి వెళ్లిపోవాలని కంపెనీ తెలిపిందని అందులో పనిచేస్తున్న కూలీలు వాపోయారు. డిసెంబరు 31 నుంచి తమకు పనిలేదని చెప్పింది. జనవరి 1 నుంచి ఖాళీగా ఉంటున్నామని కార్మికులు పేర్కొన్నారు. ఈ నెల 10న ఖాళీ చేసి వెళ్లిపోవాలని కంపెనీ విమాన టికెట్లను సిద్ధం చేసిందని తెలిపారు.
ఆ దేశం 2022లో ఫిఫా ప్రపంచకప్ పోటీల సందర్భంగా కార్మికులు అవసరమని వీసాలు మంజూరు చేసింది. ఇక్కడ ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల వరకు రెండేళ్ల వర్క్ పర్మిట్ వీసా పేరుతో వసూలు చేశారు. కానీ సంవత్సరానికే ఇంటికి వెళ్లిపోవాలని కంపెనీ చెప్పింది. “ఎన్నో ఆశలతో ఖతార్కు వచ్చాం. కంపెనీ ప్రతినిధులు కనీసం మా బాధను వినిపించుకునే సమయం ఇవ్వకుండా వెళ్లిపోవాలంటున్నారు” అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధి మార్గం చూపాలని కార్మికులు విన్నవించారు.