Weather Updates in telangana(TS news updates): తెలంగాణకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడమే కాక.. వర్షాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వర్షాలు లేక ప్రాజెక్టులు నిండక, భూగర్భ జలాలు అడుగంటాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తాగు, సాగు నీటికీ సమస్యగా మారింది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్ట్ లన్ని డెడ్ స్టోరేజ్ కి చేరాయి. ఉన్న కాస్తో కూస్తో నీటిని తాగు నీటి కోసం వినియోగిస్తామని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఎగువ రాష్ట్రాలలో కూడా వర్షాలు లేకపోవడంతో కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ జలాశయాలలో పాటు, తెలంగాణలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లు కూడా వట్టి పోయాయి.
వనపర్తి, గద్వాల జిల్లాల వరప్రదాయినిగా ఉన్న జూరాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. గతేడాది ఈ సమయానికి జూరాల నిండు కుండలా మారడంతో 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. గత ఏడాది జూలైలో కృష్ణాకు వరద పోటెత్తడంతో బేసిన్ లోని అన్ని ప్రాజెక్ట్ లు నిండు కుండల్లా మారాయి. ప్రాజెక్ట్ లకు జలకల సంతరించుకుంది. దీంతో.. జూన్ లోనే వ్యవసాయపనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ప్రాజెక్టుల దగ్గర పర్యాటకుల సందడి కనిపించింది.
కానీ.. ఈసారి పరిస్థితి మాత్రం వర్షాభావం తో పరిస్థితి భిన్నంగా మారింది. జలాశయాలు డెడ్ స్టోరేజ్ కు చేరాయి. జూలై రెండవ వారానికి కూడా సాగు పనులు మొదలుకాలేదు. ఆయకట్టుకు ఈసారి సాగు నీరు అందుతుందా అనే దానిపై అధికారులకు కూడా స్పష్టత లేదు. వరుణుడు కరుణిస్తే తప్పా సాగుకు అడుగులు పడే పరిస్థితి లేదు. ఉమ్మడి జిల్లాలో కృష్ణా జలాలపై ఆధారపడి 11 లక్షల ఎకరాలు సాగు అవుతాయి. ఇప్పటి వరకు ఆరుతడి, మెట్ట పంటల సాగు లక్ష ఎకరాలు కూడా దాటలేదు. కృష్ణానది అంతా వట్టి పోవడం, చెరువుల కుంటలు ఇంకిపోవడంతో వాన దేవుడు కరుణించాలని జనం మొక్కుతున్నారు.
మొత్తానికి వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో ఉన్న కొద్ది పాటి నీటిని సాగునీటి అవసరాల కోసం పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. మరో వారం రోజుల్లో భారీ వర్షాలు కురవని పక్షంలో కరువు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితులు రాకూడదని రైతులు కోరుకుంటున్నారు.