Telangana Budget 2024 Highlights(Telangana news live): బడ్జెట్ లో సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధిపైనా దృష్టి పెట్టింది. పెట్టుబడులను ఆకర్షించేలా విధానాలు ఉంటాయని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని బడ్జెట్ ప్రసంగంలో మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధి..
తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 2 లెదర్ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రై పోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
Read More: పేదల సంక్షేమానికి పెద్ద పీట.. భారీగా నిధులు కేటాయింపులు..
ఐటీ వెలుగులు..
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేధ ఉపయోగిస్తామని భట్టి తెలిపారు. ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి నూతన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఐటీ రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పరిశ్రమలకు రూ. 2,543 కోట్లు కేటాయించారు.
Read More: తెలంగాణ బడ్జెట్ రూ. 2,75,891 కోట్లు.. 6 గ్యారంటీలకు రూ. రూ. 53,196 కోట్లు..
నగరాలు, పట్టణాల ప్రగతి..
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. పట్టణాల అభివృద్ధిపై దృష్టిపెట్టారు. అందుకే పురపాలకశాఖకు రూ. 11,692 కోట్లు కేటాయించారు. కార్పొరేషన్లు, మున్సిపాలటీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేడమే లక్ష్యంగా నిధులు కేటాయింపులు జరిగాయి. అలాగే గ్రామాల అభివృద్ధిపైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 40,080 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది. ఈ నిధులతో గ్రామాల్లో సౌకర్యాలు మరింత మెరుగుపడేలా చేసే అవకాశం ఉంటుంది.