తెలంగాణపై బీజేపీ అధిష్టానం మళ్లీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఖమ్మంలో రైతు ఘోష బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సభలో అమిత్ షా పాల్గొంటారు. పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
ఆగస్టు 27న ఢిల్లీ నుంచి అమిత్ షా బయలుదేరతారు. మధ్యాహ్నం 1. 25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 2.10 గంటలకు కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వెళతారు. రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తారు. 3. 45 గంటల నుంచి 4. 35 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ డీలా పడింది. కాషాయ కండువాలు కప్పుకుంటారని భావించిన నేతలు వెనక్కి తగ్గారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ దూకుడుగా ముందుకెళ్లింది. ఆ బాధ్యతలు కిషన్ రెడ్డికి అప్పగించిన తర్వాత బీజేపీలో స్పీడ్ తగ్గిందనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు 4 నెలల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కాషాయ అగ్రనేతలు తెలంగాణ పర్యటనలు చేపట్టనున్నారు. బహిరంగ సభల ద్వారా పార్టీ కేడర్ లో జోష్ తెచ్చే ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు.