అందరికీ వరాలిచ్చి ఆదుకునే దేవుడికే సమస్య వచ్చిపడింది. అన్యాక్రాంతమవుతున్న తన భూములను రక్షించుకోలేకపోతున్నాడు. స్వయంగా ఈ భూమి నాదే అని ఆ దేవుడే దిగివచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పినా న్యాయం జరగని పరిస్థితి ఏర్పడింది. కొందరు రాజకీయ భూబకాసురులు తమ పలుకుబడి ఉపయోగించి భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఆలయాలకు సంబంధించిన రికార్డులను తారుమారు చేస్తూ ఇన్నాళ్లూ అందినకాడికి దోచుకున్నారు. తెలంగాణలో మొత్తం దేవుడి ఆలయాలకు సంబంధించినవి 4 లక్షలకు పైగా ఎకరాలు ఉన్నట్లు అంచనా. చాలా ప్రాంతాలలో దేవుడికి సంబంధించిన స్థలాలలో కబ్జాదారులు యథేచ్ఛగా షాపింగ్ కాంప్లెక్సులు కట్టుకుని వాటిని అద్దెకు ఇస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు.వీటికి సంబంధించిన రికార్డులు కూడా స్పష్టంగా లేకపోవడం కబ్జాదారులకు వరంగా మారింది. ఈ భూములకు సంబంధించిన కోర్టు కేసులు పెండింగ్ లో ఉండిపోవడంతో సంవత్సరాలు తరబడి కబ్జాదారులు తమ పేరిట భూములు మార్చేసుకుని బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు.పైగా కోర్టులో ఆ భూములకు నిజమైన హక్కుదారులు తామేనంటూ వాదిస్తున్నారు. అవన్నీ తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్నాయని, నిజమైన హక్కుదారులు తామేనంటూ కోర్టులో వాదనలు చేస్తున్నారు. దీనితో ఆలయ భూముల వ్యవహారం ఎక్కడకక్కడే తేలడం లేదు.
ఆక్రమణలపై ఉక్కుపాదం
ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దేవుడి మాన్యం భూముల ఆక్రమణపై ఉక్కుపాదం మోపనుంది. దేవుడి మాన్యాలు కేవలం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని అనుకోవడం పొరపాటు. అప్పట్లో ఉమ్మడి రాష్ల్ర వ్యాప్తంగా దేవాలయాలకు ఆస్తులు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఆలయాలకు సంబంధించిన భూములు కొన్ని ఏపీలోనే ఉండిపోయాయి. మరికొన్ని ఆలయాలకు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలోనూ భూములు ఉండటం విశేషం. అయితే ఏ ఆలయానికి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో తెలుసుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేవుడి మాన్యం భూములకు ఇకనుంచి జియో ట్యాగింగ్ చెయ్యాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. దీనిపై దేవాదాయ శాఖను ఇప్పటికే ఆదేశించింది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి గత కొన్నాళ్లుగా దేవాదాయ శాఖ ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆలయ భూములపై క్లారిటీ రాలేదు. రికార్డుల పరంగా ఆయా భూముల సరిహద్దులు ఎవరి పొలాల ఆధీనంలో ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయో తెలియడం లేదు. లంచాలు మరిగిన అప్పటి రెవెన్యూ అధికారులు రికార్డులు తమ ఇస్టారీతిలో మార్చేశారు. ఇప్పుడంటే కంప్యూటర్లలో రికార్డులు నిక్షిప్తం చేస్తున్నారు. అప్పుడు కేవలం మ్యాన్యూల్ పద్ధతిలోనే ఉండటంతో రికార్డులు మార్చేయడం కొందరు అధికారులకు చాలా సులభతరంగా మారింది.
పట్టాదారు పాస్ బుక్కులు
చాలా ప్రాంతాలలో రైతులు దేవుడి భూములను తమ పొలాలలోకి కలిపేసుకుని వాటికి ఉన్న సరిహద్దులను తొలగించి వ్యవసాయం చేసుకుంటున్నారు. పైగా వాటికి పక్కాగా పట్టాదారు పాస్ బుక్కులు కూడా క్రియేట్ చేసుకోవడంతో దేవాదాయ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. సంవత్సరాలకు తరబడి వీటిపై కేసులు కొనసాగుతుండటంతో ఇప్పుడు దేవాదాయ అధికారులు సంబంధిత రైతులకు నష్టపరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకుందామా ? లేక కోర్టు తీర్పు వచ్చేవరకూ ఆగుదామా అనే మీమాంసలో ఉన్నారు. అనేక ప్రాంతాలలో ఆలయాలకు అపరిమిత ఆస్తులు ఉన్నా..కనీసం దేవుడికి ధూపదీప నైవేద్యాలకు సైతం నోచుకోని దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.