Telangana Thalli Statue: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విషయాన్ని వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అట్టహాసంగా భూమి పూజ జరగనున్నదని ఆయన తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని చెప్పారు. అయితే, ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి.. సెక్రెటరియేట్ లో ఓ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఆ ప్రదేశంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించిన విధంగానే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభ కార్యక్రమం ఉండనున్నదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Also Read: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారా? సెప్టెంబర్ 17 నుంచి దరఖాస్తులు షురూ
ఇది ఇలా ఉంటే.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ హయాంలో సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని, ఒకవేళ ఏర్పాటు చేసినా.. తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు. ఏర్పాటు చేసి తీరుతామంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొన్న విషయం విధితమే.