CM Revanth Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏటా డిసెంబర్ 9న రాష్ట్రంలో తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆరోజున సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. తెలంగాణ తల్లి ఉత్సవాలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఈ నెల 2న కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ఆరోజు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆరోజు సాయంత్రం ట్యాంక్ బండ్ పై మరింత కోలాహలంగా ముగింపు వేడుకలను నిర్వహించారు. సచివాలయం, సెయిలింగ్ క్లబ్ వైపు నుంచి ట్యాంక్ బండ్ పైకి చేరుకునే రెండు మార్గాలను రెండు భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రత్యేకంగా అమ్యూజ్ మెంట్ జోన్, ఫొటో జోన్లను కూడా ఏర్పాటు చేశారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. వాళ్లకు నోటీసులు జారీ
సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు చేరుకుని ఆ స్టాళ్లను సందర్శించారు. కాగా, ఈ వేడుకల్లో సుమారుగా 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహించారు. ఆ తరువాత 70 నిమిషాల పాటు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను ఆలపించారు. అదేవిధంగా కవి, రచయిత అందెశ్రీని సన్మానించారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్న విషయం తెలిసిందే.