Telangana Students Association demands to Reventh reddy termination of retired employees: రాష్ట్రంలో రిటైరయిన ఉద్యోగులు ఇంకా ప్రభుత్వ పదవులలోనే కొనసాగుతున్నారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ150 కోట్లు ఖర్చుపెడుతోంది. దాదాపు వీళ్లు పదేళ్లుగా రిటైరయిన పదవులనే పట్టుకుని వేళ్లాడుతున్నారు. వీళ్ల అలవెన్సుల మీద ఇప్పటి దాకా ఈ పదేళ్లలో రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చుచేశారని తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర సర్కార్ పై మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ తరపున శ్రీకాంత్ యాదవ్ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు.
హామీలు ఏమయ్యాయి?
రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటైరయిన ఉద్యోగులను తొలగించి నిరుద్యోగ యువకులతో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వీళ్ల వలన గత పదేళ్లుగా ప్రమోషన్లు లేక చాలా మంది ఉద్యోగులు బాధపడుతున్నారని గుర్తుచేశారు. ఇటు ఉద్యోగులు, అటు నిరుద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఆందోళనగా ఉన్నారని..ఇప్పటికైనా అటువంటి వారిని గుర్తించి వారిని తొలగిస్తే నిరుద్యోగులకు మేలు చేసినవారవుతారని అన్నారు. పైగా రిటైరయిన ధీమాతో లంచాలకు మరిగి అక్రమంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. ఎప్పటినుంచో పదవులలో కొనసాగడం వలన వీళ్లకు ప్రభుత్వ ఆదాయానికి ఎలా గండి కొట్టవచ్చో అక్రమ లొసుగుల ద్వారా సంపాదించుకుంటున్నారని..ఇటువంటి వారిని ఉపేక్షించరాదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఎనిమిది నెలలు కావొస్తున్నా..రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపు పై దృష్టి పెట్టకపోవడం శోచనీయం అన్నారు.
నిరుద్యోగులకు అన్యాయం
ఇప్పటికీ రిటైరయిన కొందరు ఉద్యోగులు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో కొనసాగుతునే ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వం కూడా ఈ రిటైరయిన ఉద్యోగుల తొలగింపు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గతంలో విద్యార్థి సంఘాల తరపున ప్రభుత్వం పై తెచ్చిన ఒత్తిడితో ఇప్పటిదాకా వెయ్యి కి పైగా రిటైర్డ్ ఉద్యోగులను గుర్తించారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతున్నామన్నారు.