Telangana Rajya Sabha Election: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల దాఖలకు మంగళవారం సాయంత్రంతో గడువు ముగిసింది. ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి దాఖలు చేసిన 3 నామినేషన్లే చెల్లుబాటు అయ్యాయి. రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర బరిలోకి దిగారు. ఈ ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.
రాజ్యసభ అభ్యర్థులుగా మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాలేదు. శ్రమజీవి పార్టీ అభ్యర్థులుగా జాజుల భాస్కర్,
భోజరాజు కోయల్కర్ నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ పోటీకి దిగారు. ఈ ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది శాసన సభ్యలు మద్దతు తెలిపాలి. ఆ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఎమ్మెల్యేల మద్దతుతో నామినేషన్లు వేశారు. మిగిలిన ముగ్గురు అభ్యర్థులకు శాసనసభ్యుల మద్దతు లేదు. అందువల్లే శ్రమజీవీ పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి తిరస్కరించారు.
కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ , బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక లాంఛనమే కానుంది.