Telangana Power Politics(TS today news):
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు కరెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. దేశంలో తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం కూడా 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని కేసీఆర్ అంటున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ వస్తే 3 గంటలే దిక్కవుతుందని కౌంటర్లు వేస్తున్నారు. వీటిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గరం గరం అవుతున్నారు. 24 గంటల కరెంట్ నిరూపిస్తే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని రేవంత్ సవాల్ చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో కరెంట్ వైర్లు పట్టుకునేందుకు సిద్ధమా అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరో సవాల్ విసిరారు. దీంతో పవర్ పాలిటిక్స్ పవర్ ఫుల్ గా మారుతున్నాయి. అటు కుంగిన కాళేశ్వరం జోలికి వెళ్లకుండా.. లిక్కర్ కేసును ప్రధాని టచ్ చేయడం కీలకంగా మారింది.
తెలంగాణ ఎన్నికల ప్రచారాలు కరెంట్, ధరణి చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా కరెంట్ చుట్టూ కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. దేశంలో తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని కేసీఆర్ ప్రతి సభలో ప్రచారం చేసుకుంటున్నారు. అదేపనిగా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తామంటున్నారని, డీకే శివకుమార్ కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నామంటున్నారని కేసీఆర్ కౌంటర్లు వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ వస్తే కరెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని ఓటర్లను కోరుతున్నారు.
మరోవైపు తెలంగాణలో కరెంట్ ఇష్యూపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. కేసీఆర్ సర్కార్ 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తుందో చూపాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. సబ్ స్టేషన్ వెళ్లి లాగ్ బుక్ చూద్దామని, ఒకవేళ 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని సవాల్ చేస్తున్నారు. గతంలో ఇదే కరెంట్ వార్ తెరపైకి వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు సబ్ స్టేషన్లకు వెళ్లి లాగ్ బుక్ లు చెక్ చేశారు. అప్పుడు యావరేజ్ గా 12 గంటలు కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు గుర్తించారు. ఆ లెక్కన ఇప్పుడు రేవంత్ తాజా సవాల్ విసిరారు. తాను 5 గంటల కరెంట్ సరిపోతుందని ఎక్కడ చెప్పానో నిరూపించాలంటున్నారు.
కరెంట్ రాజకీయం ఎక్కడిదాకా వెళ్లిందంటే.. తెలంగాణ, కర్ణాటకలో కరెంట్ తీగలు పట్టుకుందామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ చేసే దాకా చేరింది. కర్ణాటకలో తాను 19 గంటలు కరెంట్ వైర్లు పట్టుకోవడానికి రెడీ అనీ జగదీశ్ రెడ్డి అంటున్నారు . కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి లేదంటే డిప్యూటీ సీఎం ఎవరు వస్తారో రావాలంటూ సవాల్ చేస్తున్నారు.
మరోవైపు ఓబీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ.. తెలంగాణలో హాట్ టాపిక్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన విషయాన్ని టచ్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. మళ్లీ లిక్కర్ కేసు గురించి మాట్లాడారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పి వెళ్లిపోయారు. అటు పవన్ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ టాపిక్ లేకుండా అంతా మోడీ గురించి మాట్లాడేసి ముగించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లక్ష కోట్లు పెట్టిన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రధాని ఎందుకు మౌనం పాటించారని, మేడిగడ్డ వెళ్లి ఎందుకు చూడలేకపోయారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మొత్తంగా తెలంగాణలో పవర్ పాలిటిక్స్ పోలింగ్ నాటికి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
.
.