Telangana Polls : ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి(Sabitha Indra Reddy) పోటీగా కాంగ్రెస్ ఒక బలమైన నేతను బరిలోకి దించబోతోంది.
Telangana Polls : ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే గులాబీ బాస్, ముఖ్యమంతి కేసీఆర్కు రెండుచోట్ల నుంచి గట్టిపోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, బీజేపీ తరపున ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి(Sabitha Indra Reddy) పోటీగా కాంగ్రెస్ ఒక బలమైన నేతను బరిలోకి దించబోతోంది.
ఆయన మరెవరో కాదు 23 ఏళ్ల క్రితం సబితారెడ్డికి ఎన్నికలలో గట్టి పోటీ ఇచ్చిన కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికే లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ పెద్దలు గురువారం ఢిల్లీకి ఆహ్వానించారు.
2000 సంవత్సరంలో చేవెళ్ల ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి చనిపోవడంతో ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి ఇంద్రా రెడ్డి భార్య సబితా రెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో ఆమెకు పోటీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేశారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది చివరికి సబితా రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆమె బీఆర్ఎస్లో చేరారు.
కట్ చేస్తే ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు మళ్లీ పోటీపడబోతున్నారు. కానీ ఈసారి మహేశ్వరం నియోజకవర్గం నుంచి. లక్ష్మారెడ్డి అయితేనే సబితా రెడ్డికి సరైన సమఉజ్జీగా కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అయితే లక్ష్మారెడ్డి గత కొన్ని నెలలుగా తాండూరు నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయనను ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించి.. సబితా రెడ్డితో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు ఒప్పించారు.
కాంగ్రెస్ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో కూడా లక్ష్మారెడ్డి పేరు మహేశ్వరం నుంచి ఖరారు అయింది. 23 ఏళ్ల తరువాత మళ్లీ ఈ నేతలలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.