Telangana Politics : తెలంగాణలో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు పూర్తిస్థాయి ఫ్రెండ్లీ పార్టీలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో గాభరా మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. మైనార్టీలు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో అలర్ట్ అవుతున్నారు. దీంతో అక్బరుద్దీన్ ఓవైసీ రోజూ రేవంత్ రెడ్డి టార్గెట్ గా సవాళ్లు విసురుతున్నారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేస్తారా అన్న దాకా విషయం వచ్చింది. అసలు BRS, MIMలో ఎందుకింత అలజడి??
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి వర్గం ఓట్లు కూడా చాలా కీలకమే. ఇందులో మైనార్టీ ఓట్లు మరింత కీలకం. ఎంత లేదన్నా ఓ 30 నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ వర్గం ఓటర్లు గుంపగుత్తగా ఓట్లు వేస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువ. దీంతో పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. కాంగ్రెస్ 6 గ్యారెంటీ హామీలతో మైనార్టీ వర్గాలు అటువైపు ఆకర్షితమవుతున్నట్లు వివిధ సర్వే రిపోర్టులు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు ప్రభుత్వానికి అందినట్లు తెలిసింది. అటు ముఖ్యమైన వ్యాపారవేత్త మస్కటీ కూడా ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఓల్డ్ సిటీలో హస్తం హవా మరింత పెరిగింది. అందుకే ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగిందన్న టాక్ ఉంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఓవైపు రాహుల్, ఇంకోవైపు రేవంత్ రెడ్డి టార్గెట్ గా డైలాగ్ లు పేల్చుతున్నారు.
ఓవైసీలు మహారాష్ట్ర నుంచి వచ్చారన్న కామెంట్లపై అక్బరుద్దీన్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. రాహుల్, సోనియా ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నిస్తూనే.. RSSతో సంబంధం లేదని, సావర్కర్ ను నమ్మనని, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. అక్కడితో ఆగకుండా సీఎం పీఠంపై ఎవరు కూర్చున్నా వారితో పని చేయించుకునే కెపాసిటీ తమకు ఉందంటూ మాట్లాడారు.
సీన్ కట్ చేస్తే అసలు సీన్ తెరపైకి వస్తోంది. మొన్నటికి మొన్న ప్రధాని మోడీ నిజామాబాద్ సభలో కేసీఆర్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో కామెంట్ చేశారు. ఎన్డీఏలో చేరడానికి కేసీఆర్ ప్రయత్నించారని చెప్పడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే బీఆర్ఎస్ తో పూర్తిస్థాయి ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న ఎంఐఎంను ఈ వ్యాఖ్యలు ఇరుకున పెట్టాయా అన్నది కీలకంగా మారింది. ఈ టాపిక్ పై మజ్లిస్ నేతలు రియాక్ట్ అవడం లేదు. బీఆర్ఎస్ నేతలు మాత్రం కౌంటర్ ఇచ్చుకున్నారు. డిపాజిట్ రాని పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు. అంతే కాకుండా.. జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో బీజేపీనే తమతో పొత్తుకు సిద్ధపడిందంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
BRSకు పూర్తిస్థాయిలో మద్దతిస్తున్న మజ్లిస్ కు ప్రస్తుతం మైనార్టీలు దూరమవుతున్నారన్న భయం పట్టుకుందా ? అన్న చర్చ కూడా నడుస్తోంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీ హామీల పట్ల మైనార్టీలు ఆకర్షితులయ్యారని సర్వేలు వస్తున్నాయి. దీంతో ఆ వర్గం ఓట్లు హస్తంవైపు వెళ్లకుండా ముందు జాగ్రత్త పడుతున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. RSS మూలాలు లేవని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయాలన్న సవాళ్లు, రేవంత్ రెడ్డి గాడ్సే లాంటి వ్యక్తి అని కేటీఆర్ అనడం.. ఇవన్నీ అందులో భాగమే అంటున్నారు.
మరోవైపు అక్బరుద్దీన్ కామెంట్లపై కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తోంది. BRS, BJPల మెప్పు కోసమే అక్బరుద్దీన్ మాట్లాడుతున్నారని ఫైర్ అవుతోంది. అంతే కాదు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో BRS, BJP, MIM మధ్య అవగాహన కుదిరిందని, ఆ మూడు పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేయాలో సీట్ల పంపకాలు పూర్తి చేసుకున్నాయని రేవంత్ రెడ్డి అంటున్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నాయన్నారు.
బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో చేస్తోంది. దీంతో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఘట్ కేసర్ లో జరిగిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ లో జేపీ నడ్డా నేతలకు సూచించడం కీలకంగా మారింది.