Telangana Police Jobs : పోలీస్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు గుడ్ న్యూస్. తెలంగాణ పోలీసు ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూల్ వచ్చింది. డిసెంబరు 8 నుంచి జనవరి 3 వరకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలను ఎంపిక చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్తోపాటు మరో ఒకటి రెండు కొత్త ప్రదేశాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. వాటిలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మైదానాల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉంచడంతోపాటు.. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మైదానంలో సగటున 130 మంది సిబ్బంది ఈవెంట్లను పర్యవేక్షించనున్నారు.
ఈవెంట్స్ కు సంబంధించి అడ్మిట్ కార్డులను నవంబర్ 29 నుంచి వెబ్సైట్లో ఉంచనున్నామని పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఈ అడ్మిట్ కార్డులను డిసెంబర్ 3 వరకు వెబ్సైట్లో ఉంచనున్నారు. వీటిని అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు నమోదుచేసి వెబ్సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఫిజికల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. పరుగుపందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో లాంగ్జంప్, షాట్పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు. వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు. ఫిట్నెస్ టెస్ట్లో ప్రతి అభ్యర్థి ఛాతీ, ఎత్తు, బరువును నమోదుచేస్తారు…స్పాట్
రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్ఐ పోస్టులకు ఆగస్టు 7న ప్రిలిమ్స్ జరిగింది. అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ఎగ్జామ్ నిర్వహించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో మొత్తం 41.67 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎస్ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా, 1,05,603 మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా, 1,84,861 మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా, 18,758 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518 మంది ఉత్తీర్ణత సాధించారు.
గతంలో ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు పోటీ పడితే ఆన్నిసార్లు ఫిజికల్ ఈవెంట్లు వేర్వేరుగా నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు ఎన్ని పోస్టులకు పోటీపడినా ఒకసారి అర్హత సాధిస్తే సరిపోయేలా కీలక మార్పులు చేశారు. ఒకసారి అర్హత సాధించగలిగితే ఆ ఫలితాల్ని మూడు నెలలపాటు పరిగణనలోకి తీసుకోనున్నట్లు మండలి ప్రకటించింది.