TG Phone tapping case focus by Central govt(Telangana news): తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాక రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు వార్తలు జోరందుకున్నాయి. సమగ్ర సమాచారం సేకరించేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వింగ్ రంగంలోకి దిగినట్టు ఓ వార్త పొలిటికల్ సర్కిల్స్లో హంగామా చేస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఈ విషయమై తెలంగాణ పోలీసులతో మంతనాలు జరిపినట్టు అందులోని సారాంశం. అంతేకాదు.. మొన్న, నిన్న ఢిల్లీ ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు రాష్ట్ర పోలీసు అధికారులతో మాట్లాడారన్నది కీలక పాయింట్. ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినట్టు చెబుతున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించినట్లైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దలను ఇరికించేందుకు స్కెచ్ వేశారు. బీఎల్ సంతోష్ను ఫామ్హౌస్ కేసులో ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని మాజీ డీసీపీ రాధాకిషన్ తన వాంగ్మూలంలో వెల్లడించడంతో ఈ అంశాన్ని కేంద్రం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం.
జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే, మరుసటి రోజు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగాలు హైదరాబాద్కు రానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కారు పార్టీకి కష్టాలు తప్పవన్నది పలువురు నేతలు మాట. లిక్కర్ కేసు నుంచి కవితను కాపాడుకునేందుకు బీజేపీ పెద్దలను ఇరికించే విషయాన్ని బీజేపీ హైకమాండ్ సీరియస్గా తీసుకున్నట్లు కొందరు నేతలు అంతర్గతంగా చెబుతున్నారు. ఈ క్రమంలో కేసు సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని ఆయన చెప్పడం వెనుక ఇదే కారణమని అంటున్నారు.
ALSO READ: 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం..అందులో ఎవరెవరున్నారంటే ? : ప్రణీత్ రావు
ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలన్నా ప్రత్యేకంగా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. భద్రతకు సంబంధించి అంశమైతే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుని ఫోన్ ట్యాపింగ్ చేయాలి. రాష్ట్ర స్థాయిలో సీరియన్ కేసుల విషయంలో అవసరమైతే ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారంగా వినియోగించినట్టు నిందితుల ఛార్జ్షీటు ద్వారా బట్టబయలు అయ్యింది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ఏమోగానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనే చర్చ జరుగుతోంది.