Mahesh Kumar Goud as Telangana PCC Chief: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్ని ఉత్కంఠ మరికొద్దిసేపట్లో తెర పడనుంది. ఈ మేరకు పీసీసీ సారథి ఎంపిక ఎట్టకేలకు ఖారారైనట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా పీససీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడ్డారు. తమ పేర్లను పరిశీలించాలని అధిష్టాన వర్గానికి సైతం కోరారు. అయితే పీసీసీ అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో పలు దఫాలు సమావేశమైన రాష్ట్ర నాయకులు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రచార కమిటీ సభ్యుడు మధుయాష్కీగౌడ్, ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ వంటి పేర్లు పరిశీలనకు వచ్చాయని సమాచారం.
ఈ చర్చల్లో బీసీలకే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో బీసీ నాయకుడే పీసీసీ సారథిగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర నాయకత్వం నుంచి అభిప్రాయం తీసుకున్న పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధ్యక్షుడితోపాటు కార్యనిర్వాహక అధ్యక్షుల సహా మరికొన్ని పదవులు కూడా ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: వెరీగుడ్.. సీఎం: సీపీఐ నారాయణ ప్రశంసలు
అయితే, పీసీసీ అధ్యక్ష రేసులో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. మధుయాష్కీతోపాటు మహేశ్ కుమార్ తో వేర్వేరుగా అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. చివరకు మహేశ్ కుమార్ గౌడ్ వైపై అధిష్టానం మొగ్గు చూపినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా, నేడో రేపో అధిష్టాన వర్గం అధికారికంగా పేరును ప్రకటించే అవకాశం ఉంది.