TG Ministers fires on Govt Employees(Latest news in telangana): ప్రభుత్వ ఉద్యోగి లైఫ్ ఉన్నంత బిందాస్ గా మరెవ్వరి లైఫ్ ఉండదంటే అతిశయోక్తి కాదేమో. వాళ్లకేంటి.. ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ఎప్పుడు ఆఫీసుకెళ్లినా అడిగేవారెవరూ ఉండరు. ఆఫీసు నుంచి ఎప్పుడు వచ్చేసినా పట్టించుకునేవారుండరు. ఇది ప్రజల్లో బలంగా నాటుకుపోయిన మాటలు. అందుకే ఈ కాన్సెప్టులపై వచ్చే సినిమాలు కూడా హిట్టవుతున్నాయి. ఆఫీసులకు లేటుగా వెళ్తున్నామన్న భావన వాళ్లకి అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ల చేతి గడియారాల్లో ఉన్న టైమే.. కరెక్ట్ టైమ్. వాళ్ల లెక్కప్రకారం కరెక్ట్ టైమ్ కే వచ్చినట్లు అనమాట. తాజాగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి ఆఫీసులకు రావడం లేదన్న విషయం తెలుసుకున్న మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పదిన్నర, పదకొండు గంటలకు ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన మంత్రులకు ఎదురైన అనుభవం ఇది.
తమ పేషీల్లోని ఉద్యోగులతో మాట్లాడేందుకు వెళ్లిన మంత్రులకు మచ్చుకైనా ఎవరూ కనిపించలేదంటే ఒట్టు. బారెడు పొద్దెక్కినా ఒక్కరూ ఆఫీసుకు రాలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తమ ఛాంబర్లు, పేషీల్లోకి వెళ్లారు. అక్కడ ఉద్యోగులెవరూ కనిపించలేదు. దాదాపు గంటన్నరసేపు అక్కడే ఉండి.. అసలు ఏ సమయానికి వస్తున్నారో తెలుసుకున్నారు. పదకొండున్నరయ్యాక కొందరు వచ్చారు. ఉన్న ఉద్యోగుల్లో 50 శాతం మంది ఉద్యోగులు కూడా 11.30 గంటలకు రాకపోవడంతో.. మంత్రికి కోపమొచ్చింది. అంతే.. ఉద్యోగులపై ఇంతెత్తున లేచారు.
Also Read : సాయంత్రం హైదరాబాద్కు సీఎం చంద్రబాబు, షరతులతో ర్యాలీకి పోలీసుల అనుమతి
సమస్యలతో ఇబ్బందిపడే ప్రజలకు సీఎం, మంత్రులను కలిసే అవకాశం దొరక్క వాటి పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులను ఆశ్రయిస్తుంటారు. మీరు కూడా అందుబాటులో లేకపోతే ఇంకా ఇబ్బంది పడాలా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే 18 గంటలు పనిచేస్తే సరిపోదుగా. వాళ్లతో పాటు.. ఉద్యోగులు కూడా పనిచేయాలి. 18 గంటలు కాదు కదా.. కనీసం 8 గంటలు కూడా డ్యూటీ చేయడం లేదు. పదకొండున్నరకు ఆఫీసుకొస్తే.. సాయంత్రం 5 గంటలయ్యేసరికి వెళ్లిపోతారు. అంటే ఐదున్నర గంటలు. అందులో మళ్లీ లంచ్ బ్రేకులు, స్నాక్స్ బ్రేకులు, టీ బ్రేకులు. గంటన్నర తీసేస్తే.. నాలుగు గంటలు.
అంటే సీఎం సహా.. మంత్రులు ఉదయం 4 గంటల నుంచే ప్రజలకోసం పనిచేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం అందులో 50 శాతమైనా పనిచేయకపోవడంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏవో పనులుండి ఎప్పుడోకప్పుడు లేటంటే ఓకే గానీ.. రోజూ ఇదే పరిస్థితి అయితే ప్రజల సమస్యలెలా తీరుతాయని ప్రశ్నించారు. ఇకనుంచి ఉద్యోగులు సమయానికి ఆఫీసులకు వచ్చి.. సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.