నంది అవార్డులపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తామని ఆయన తెలిపారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి పేరు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ అవార్డులు ఇస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత సినీపెద్దలను ఆహ్వానించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
తెలుగు సీనీపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు మురళీ మోహన్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నటసింహ చక్రవర్తి బిరుదుతో మురళీమోహన్ను సత్కరించారు. అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డుల ప్రకటన ప్రశ్నార్థకమయ్యిందన్నారు.
అటు ఏపీలోని జగన్ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వలేదని, ఇటు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సింహా అవార్డుల పేరుతో అవార్డులు ఇస్తామని చెప్పినా ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా నంది అవార్డులు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసే అవకాశం ఉంటే అవార్డులపై విన్నవిస్తామన్నారు. 2024లో నంది అవార్డులు ఇవ్వాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు మురళీ మోహన్.