Telangana Medical Council Taking Action on Fake Doctors in the State: జ్వరం వచ్చిందని వీధి చివర ఉండే క్లీనిక్కు వెళుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. నల్లకోటు వేసుకున్న ప్రతివారు లాయర్లూ కాదు. అలానే తెల్లకోటు వేసుకున్న ప్రతివారు డాక్టరూ కానక్కర్లేదు.. అందుకే మీకు ఇంజెక్షన్ చేసే డాక్టర్ అసలు డాక్టరేనా..? అతను లేదా ఆమె రాసే మందులు నిజంగా మన బాడీకి అవసరమేనా? అన్నది ఆలోచించండి.. లేదంటే ఉన్న రోగం పోతుందో లేదో తెలియదు కానీ.. కొత్త రోగం రావడం మాత్రం గ్యారెంటీగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. డాక్టర్లు అంటూ బోర్డులు ఉంటాయి. ఆసుపత్రులు వెలుస్తాయి.
పక్కనే మెడికల్ షాప్లు.. ఆ పక్కనే డయాగ్నొస్టిక్ సెంటర్లు. ఎవరైనా ఇబ్బంది పడుతూ వచ్చారంటే చాలు. ఇక్కడ ఫీజులు.. అక్కడ టెస్టులు.. వెళ్లేప్పుడు మిగిలిన డబ్బులను మెడికల్ షాపుల్లో సమర్పించుకొని వెళ్లడం. ఇదే తంతు జరుగుతోంది. మరి వీటన్నింటికి అనుమతులు ఉంటాయా అంటే ఉండవు. పోనీ రోగం చేయాల్సిన పద్ధతుల్లో నయం చేస్తున్నారా? అంటే అదీ లేదు. అప్పటికప్పుడు నయం కావడానికి హైడోస్ యాంటి బయాటిక్స్ వాడటం. దీంతో అసలుకే మోసం వస్తుందంటున్నారు అసలైన డాక్టర్లు…
ప్రస్తుతం తెలంగాణ స్టేట్వైడ్గా సోదాలు జరుపుతున్నారు తెలంగాణ వైద్య మండలి సభ్యులు. ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా.. RMP ముసుగులో ఆసుపత్రులను నడుపుతున్న వారి భరతం పడుతున్నారు.ఒక్క హైదరాబాద్లోని చింతల్, షాపూర్నగర్ ప్రాంతాల్లో సోదాలు చేస్తే.. 50 మంది నకిలీ డాక్టర్ల లెక్క తేలింది. ఏ ఇబ్బంది ఉంది అని బాధితులు వచ్చినా.. ఆసుపత్రుల్లో చేర్చుకోవడం.. పెద్ద సంఖ్యలో యాంటీ బయాటిక్స్ ఇవ్వడం. ఇదే సీన్ ప్రతిసారి రీపిట్ అవుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు.. ఇప్పటికే స్టేట్వైడ్గా సోదాలు మొదలుపెట్టారు. 50 మంది డాక్టర్లపై FIRలు కూడా నమోదు చేశారు. ఇప్పటికే కొంత మందిని జైలుకు కూడా పంపారు.
Also Read: హనుమాన్ ర్యాలీలో ఉద్రిక్తత, కత్తితో ఓ వ్యక్తి హంగమా, పోలీసు వాహనం డ్యామేజ్
రోగులకు చికిత్స చేయాలంటే ఉండాల్సింది. ముందు సరైన అవగాహన.. తగినంత నాలెడ్జ్.. అన్నింటికంటే కావాల్సింది అనుభవం. బట్ చాలామంది నకిలీ డాక్టర్లుగా చెలామణి అవుతున్న వారికి ఇవేవీ ఉండవు. కానీ ట్రీట్మెంట్ చేసేస్తారు.. కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీస్తారు. నిజానికి రూల్స్ ప్రకారం ఆర్ఎంపీ, పీఎంపీలు.. ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు మాత్రమే పరిమితం కావాలి. తమ సెంటర్కు ప్రథమ చికిత్స కేంద్రం అని బోర్డు మాత్రమే పెట్టుకోవాలి. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు హేవీ డోస్ ఇంజక్షన్లు.. పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు. వీటి వల్ల ఉన్న రోగం తగ్గకపోగా కొత్తగా ఫిట్స్ రావడం. బీపీ పెరగడం, తగ్గడం, తల తిరగడం, వాంతులు, ఒంటి నొప్పులు కొత్తగా తయారవుతున్నాయి. ఈ టైమ్లో సరైన ట్రీట్మెంట్ అందకపోతే.. మరణమే శరణమవుతుంది..
చాలా రోజులుగా ఆర్ఎంపీ, పీఎంపీలపై సర్కార్ కంట్రోల్ లేదు. దీంతో వాడకో క్లినిక్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఏదైనా ఓ హాస్పిటల్లో నాలుగు నెలలు పనిచేస్తే చాలు. తర్వాత ఆర్ఎంపీలుగా అవతారం ఎత్తేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రేవంత్ సర్కార్ వీరిపై ఫోకస్ చేసింది. క్లినిక్ పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. మూడు నెలలుగా RMP, PMP ప్రాక్టీషనర్లపై వరుసగా తనిఖీలు చేస్తోంది.
Also Read: Srikalahasti Politics: బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ?
ఇదంతా నాణేనాకి ఒకవైపు.. మరోవైపు తాము ఏ అక్రమాలు చేయలేదంటున్నారు ఆర్ఎంపీ డాక్టర్లు.. వెంటనే ప్రభుత్వం సోదాలను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు. కావాలనే తమపై కేసులు నమోదు చేస్తున్నారనేది వారి ఆరోపణ.. నిజంగా ఫస్ట్ ఎయిడ్ చేసే వారికి ఎలాంటి బాధ లేదు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కాకుండా.. క్లినిక్ అనే బోర్డు ఉన్నా.. ఆ క్లినిక్లో బెడ్స్ ఉన్నా.. మెడికల్ షాప్స్ ఉన్నా.. ఇకనైనా వెంటనే తొలగించండి. లేదా నేడో, రేపో అధికారులు వస్తారు. కేసులు నమోదు చేస్తారు.. ఇది మాత్రం తథ్యం.